నిజామాబాదు
వికీపీడియా నుండి
?నిజామాబాదు ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 7,956 కి.మీ² (3,072 చ.మై) |
ముఖ్య పట్టణము | నిజామాబాదు |
ప్రాంతం | తెలంగాణ |
జనాభా • జనసాంద్రత • పట్టణ • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
2,89,722 (2001) • 294/కి.మీ² (761/చ.మై) • 423000 • 1162000 • 1181000 • 53.26 • 66.27 • 40.57 |
అక్షాంశరేఖాంశాలు: నిజామాబాదు (Nizamabad) జిల్లా భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క తెలంగాణ ప్రాంతము నందు ఉన్నది. నిజామాబాదు నగరము ఈ జిల్లా ముఖ్య పట్టణము. నిజామాబాదు ను పూర్వము ఇందూరు మరియు ఇంద్రపురి అని పిలిచేవారు. బోధన్, కామారెడ్డి, ఆర్మూరు ఇతర ప్రధాన నగరములు. నిజామాబాదు నగరం హైదరాబాదు, వరంగల్ తరువాత తెలంగాణాలో అతిపెద్ద నగరం.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
నిజామాబాద్ ను 8వ శతాబ్దములొ రాష్ట్రకూట వంశానికి చెందిన ఇంద్రవల్లభ పాంత్యవర్ష ఇంద్ర సొముడనే రాజు పరిపాలించాడు. అతని పేరుపైననే ఈ ప్రాంతానికి ఇందూరు అని పేరు వచ్చినది. తరువాత 1905వ సంవత్సరములో ఈ ప్రాంతములో నుండి (సికింద్రాబాద్ నుండి మన్మాడ్ వరకు) రైలు మార్గము ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడి ప్రాంతానికి అప్పటి రాజు నిజాం-ఉల్-ముల్క్ పేరు పెట్టి,నిజామాబాద్ గా మార్చడం జరిగింది.
[మార్చు] భౌగోళిక వివరాలు
జిల్లాకు సరిహద్దులుగా, ఉత్తరాన అదిలాబాదు జిల్లా, తూర్పున కరీంనగర్, దక్షిణాన మెదక్ జిల్లాలు, పశ్చిమాన కర్ణాటక లోని బీదరు జిల్లా మరియు మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. 18-5' మరియు 19' ఉత్తర అక్షాంశాల మధ్యా, 77-40' మరియు 78-37' తూర్పు రేఖాంశాల మధ్య జిల్లా విస్తిరించి ఉన్నది. సముద్రతీరానికి సుదూరంగా ఉండటంచేత జిల్లా వాతావరణం భూమధ్యరేఖా వాతావరణం గాను, విపరీత ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు ఉంటాయి. సగటు కనిష్ట ఉష్ణోగ్రత 13.7'C, సగటు గరిష్ట ఉష్ణోగ్రత 39.9'C గాను ఉన్నాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రత 5'C వరకు పడిపోవడం, వేసవిలో 47'C వరకు పెరగడం కూడా కద్దు. జిల్లా విస్తీర్ణం 7956 చ.కి.మీ, అనగా 19,80,586 ఎకరాలు. జిల్లాలోని 36 మండలాల్లో ఉన్న 923 గ్రామాల్లో 866 నివాసమున్నవి కాగా, 57 గ్రామాలు ఖాళీ చెయ్యబడినవి గానీ, లేక నీటిపారుదల ప్రాజెక్టులలో ముంపుకు గురయినవి గాని.
[మార్చు] జిల్లా గణాంకాలు
- రెవిన్యూ మండలాలు: 36
- రెవిన్యూ విభాగాలు: (3) బోధన్, నిజామాబాద్, కామారెడ్డి
- లోక్సభ నియోజకవర్గాలు:(1) నిజామాబాదు
- శాసనసభ నియోజకవర్గాలు: (9) జుక్కల్, బాల్ కొండ, ఆర్మూర్, బాన్స్వాడ, బోధన్, నిజామాబాదు, డిచ్పల్లి, కామారెడ్డి, ఎల్లారెడ్డి.
- నదులు: మంజీరా నది
- జిల్లా ప్రముఖులు:
- ప్రముఖ రచయిత డా.కేశవరెడ్డి. రాయలసీమలో జన్మించిన ఈయన, జిల్లాలోని డిచ్పల్లి లో స్థిరపడి, పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాడు.
[మార్చు] పర్యాటక ప్రదేశాలు
నిజాంసాగర్, శ్రీరాంసాగర్, పోచారం, ఆలీసాగర్, నిజామాబాదు కోట, డిచ్పల్లి రామాలయం, తిలక్ గార్డెన్ వద్ద ఉన్న మ్యూజియం, దోమకొండ కోట, కంటేశ్వర్ దేవాలయం, కిల్లా రామాలయం, మల్లారం అడవి, అశోక్ సాగర్, సారంగాపూర్, ఆర్మూరు రోడ్డు లోని శిలలు మొదలైనవి జిల్లాలోని కొన్ని పర్యాటక ఆకర్షణలు. నిజామాబాదు కోట, రఘునాథదాసు నిర్మించిన ఒకప్పటి రామాలయంపై నిర్మించారు. ఆయనే నిర్మించిన పెద్ద చెరువు నేటికీ నిజామాబాదు నగర మంచినీటి అవసరాలు తీరుస్తోంది. ఈ పర్యాటక ప్రదేశాలన్నీ అందమైన తోటలతో, అతిథిగృహాల వంటి సౌకర్యాలతో యాత్రికులకు సౌకర్యవంతంగా ఉన్నాయి.
- పురాతత్వ ప్రదర్శనశాల
నిజామాబాదు లోని జిల్లా పురాతత్వ ప్రదర్శనశాలలో ప్పాతిరాతియుగం నుండి విజయనగర సామ్రాజ్య కాలం వరకు మానవ నాగరికత పురోగతిని తెలియజేసే పురాతన వస్తువులు ఉన్నాయి. 2001 అక్టోబర్ లో ప్రారంభమైన ఈ ప్రదర్శనశాలలో పురాతత్వ విభగం, శిల్పకళా విభాగం, కాంస్య, అలంకరణ విభాగం అనే మూడు విభాగాలు ఉన్నాయి. బిద్రీ వస్తువులు మరియు అనేక రకములైన ఆయుధములు కూడా ప్రదర్శనలో ఉన్నాయి.
- మల్లారం అడవి
మల్లారం అడవి నిజామాబాదు నుండి 7 కిలోమీటర్ల దూరములో ఉన్నది. చూట్టు వన్య ప్రదేశములో ఒదిగిఉన్న మల్లారం ప్రకృతి పర్యటణకు సరైన స్థలము. అడవి మార్గములు, ఒక గోపురము మరియు ఒక దృశ్యకేంద్రమున్న టవర్ ఇక్కడి ముఖ్య ఆకర్షణలు. 1.45 బిలియన్ సంవత్సరాల పురాతనమైన శిల ఇక్కడ మిమ్మల్ని ప్రకృతి ఒడిలోకి పిలుస్తుంది. సాహసిక పర్యటనలకు మరియు ఉత్తేజితమైన పిక్నికులకు చాలా అనువైన ప్రదేశము.
- అశోక్ సాగర్
అందమైన శిలలు మరియు ఉద్యానవనాలతో దృశ్యసౌందర్యమైనది అశోక్ సాగర్ చెరువు. హైదరాబాదు - బాసర రోడ్డులో నిజామాబాదు నుండి 7 కిలోమీటర్ల దూరములో ఉన్నది. ఇక్కడ ఉద్యానవనము చక్కగా తీర్చిద్దిబడి వెలిగించబడిన శిలలతో ఉన్నది. ఈ సరస్సులో పడవ విహారము కూడా చేయవచ్చు.
- అలీసాగర్
అలీసాగర్ నిజామాబాదు నుండి 10 కిలోమీటర్ల దూరములో నిజామాబాదు - బాసర రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరములో ఉన్నది. ఈ మానవ నిర్మిత జలాశయము 1930లొ కట్టబడినది. నగర జీవితము యొక్క హడావిడికి దూరముగా ఈ జలాశయము ప్రశాంత వాతావరణము కల్పిస్తుంది. వన్య ప్రాంతముతో పాటు కల వేసవి విడిది, చక్కగా తీర్చిదిద్దిన ఉద్యానవనాలు, ఒక దీవి మరియు కొండపైనున్న అతిధిగృహము దీనిని పర్యాటకులకు ఒక ముఖ్య గమ్యస్థానముగా చేస్తున్నాయి. వీటితో పాటు జింకల పార్కు, ట్రెక్కింగ్ మరియు జలక్రీడలకు సదుపాయాలు ఉండటము అదనపు ఆకర్షణ.
- ఆర్మూరు రోడ్డు లోని శిలలు - ఆర్మూరు
- దోమకొండ కోట - దోమకొండ
[మార్చు] పుణ్య క్షేత్రాలు
జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో లింబాద్రి గుట్ట, బడా పహాడ్, బిచ్కుంద మరియు సారంగాపూర్ మొదలైనవి కలవు.
- లింబాద్రి గుట్ట
లింబాద్రి గుట్టపై ప్రశాంత వాతావరణములో శ్రీ నరసింహ స్వామి ఆలయము నెలకొన్నది. ఈ ప్రదేశము భీంగళ్ నుండి 4 కిలోమీటర్ల దూరములో ఉన్నది. ప్రతి సంవత్సరము కార్తీక సుద్ధ తదియ నుండి త్రయోదశి వరకు ఇక్కడ ఉత్సవము జరుగును.
- బడా పహాడ్
వర్ని మరియు చండూరు మధ్య ఉన్న బడా పహాడ్ పైన సయ్యద్ సదుల్లా హుస్సేనీ దర్గాలో అనేక మంది ప్రజలు శ్రద్ధాంజలి ఘటించడానికి వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరము జాతర కూడా జరుగును.
- సారంగాపూర్
నిజామాబాదు నుండి 8 కి.మీ.ల దూరంలో ఉన్న సారంగాపూర్ వద్ద హనుమంతుని దేవాలయం ఉంది. ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు, దాదాపు 452 ఏళ్ళ కిందట ఈ ఆలయానికి శంకుస్థాపన చేసాడు. చక్కటి రవాణా సౌకర్యాలతో, భక్తులకు అవసరమైన వసతి వంటి అన్ని సౌకర్యాలు ఈ ప్రదేశం కలిగిఉంది.
- కంఠేశ్వర్
ఈకంఠేశ్వర్ వద్ద ఉన్న నీలకంఠేశ్వరుని రూపంలో ఉన్న శివుని దేవాలయం పురాతనమైనది. ఉత్తర భారత వాస్తు శైలిలో ఉండే ఈ ఆలయాన్ని శాతవాహన చక్రవర్తి యైన రెండవ శాతకర్ణి జైనుల కొరకు కట్టించాడు. రథసప్తమి పండుగను ప్రతిఏటా పెద్దేత్తున జరుపుతారు.
- డిచ్పల్లి రామాలయం - డిచ్పల్లి
- ఖిల్లా డిచ్ పల్లి రామాలయం
క్రీ.శ. 1600 ప్రాంతంలో విజయనగర రాజులు డిచ్ పల్లి దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 76 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ద్వారాలపై నగిషీ, గోపురాలపై ద్రావిడుల ప్రభావం కన్పిస్తుంది. విజయనగర రాజుల శిల్ప రీతి కనిపించడంతో 16వ శతాబ్దం మధ్య కాలంలో రామరాయల హయాంలో నిర్మించి ఉండొచ్చని భావిస్తున్నారు. నిర్మాణం మొత్తం చాలావరకు నల్లరాయితో జరిగింది. ఈ దేవాలయానికి ఎదురుగా చెరువు మధ్యలో నిర్మించిన మండపం ప్రత్యేక ఆకర్షణ.
- ఖిల్లా రామాలయం
ఇందూరు, ఇంద్రపురి అనేపేర్లు కలిగిన నిజామాబాదు పట్టణాన్ని, ఇక్కడి కోటను రాష్ట్రకూటులు నిర్మించారు. వారి కాలంలోనే నిర్మించిన 40 అడుగుల ఎత్తున్న విజయస్థూపం కూడా ఇక్కడ ఉంది. క్రీ.శ. 1311లో ఈ కోటను అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమించాడు. తరువాత అది బహమనీ రాజుల చేతుల్లోకి, ఆపై కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీల చేతుల్లోకి వెళ్ళింది. విశాలమైన ఈ కోట రాతి గోడలతో, నాలుగు మూలల నురుజులతో ఉంది. క్రీ.శ.10 వ శతాబ్దపు ఈ రాష్ట్రకూటుల కోట ప్రస్తుతం ఆసఫ్ జాహీ ల శైలిలో విశాలమైన గదులతో ఉంది. కోటలో సమర్థ రామదాసు నిర్మించిన బడా రామాలయం మరో ఆకర్షణ.
- రాజరాజేశ్వరస్వామి దేవాలయము
భిక్కనూరు రాజరాజేశ్వరస్వామి దేవాలయము నిజామాబాదు నుండి 70 కిలోమీటర్ల దూరములో ఉన్నది.
[మార్చు] సౌకర్యాలు
[మార్చు] నగర విశేషాలు
[మార్చు] సంస్థానాలు
జిల్లాలో చారిత్రక శిల్పసంపదకు కొదవలేదు. రాజులు ఏలిన సంస్థానాలలో నేటికీ చారిత్రక కట్టడాల ఆనవాళ్ళు దర్శనమిస్తున్నాయి. క్రీ.పూ.3000 నాటికే జిల్లాలో మానవుల ఉనికి ఆధారాలున్నాయి. అందుకు చరిత్రకారులకు దొరికిన 'కైరన్'(చనిపోయిన వారిని వారికి ఇష్టమైన వస్తువులతో కలిపి పూడ్చిపెట్టి దాని చుట్టూ కొన్ని గుర్తులను అమర్చడం)లే నిదర్శనం. దీని ద్వారానే ప్రాచీన కట్టడాలైన రాష్ట్ర కూటులు, బోధన్ చాళుక్య, కల్యాణి చాళుక్యులు, కాకతీయుల ఆలయాలు, ముస్లిం నిర్మాణాలు తెలిశాయి.
- జిల్లాలోని సంస్థానాలు
రాజులకు సేవచేసిన కొందరికి అధిక మొత్తంలో భూమిని ధారాదత్తం చేసేవారు. అలా ఎక్కువ మొత్తంలో భూమి పొందిన వారినే సంస్థానాధీశులుగా పేరుపొందారు. సంస్థానాలు అంటే చాలామొత్తంలో ఎక్కువ గ్రామాలు అధికారి ఏలుబడి కింద ఉండడం. ముస్లిం రాజుల పరిపాలనలో అధికార భాషలుగా ఫారసీ,ఉర్దూ ఉండేవి. జిల్లాలో దోమకొండ, సిర్నాపల్లి, కౌలాస్ సంస్థానాల ఆనవాళ్ళు నేటికీ పదిలం.
- కౌలాస్
కాకతీయ సామ్రాజ్యం అంతమైన తరువాత బహమనీ సుల్తానులు కౌలస్ దుర్గాన్ని వశపరచుకున్నారు. ఈ సంస్థానానికి ఔరంగజేబు ద్వారా రాజా పథంసింగ్ గౌర్ ను కౌలాస్ సంస్థానాధీశునిగా నియమితులయ్యారు. ఇతని వారసులు స్వాతంత్ర్యం వరకు అసఫ్ జాహి నైజాం రాజులకు సామంతులుగా వారి రాజ్య పరిరక్షణలో ముఖ్యపాత్ర పోషించారు. రాజా దీప్ సింగ్ 1857 తిరుగుబాటులో ముఖ్యపాత్ర పోషించి బ్రిటీషువారిచే శిక్షకు గురయ్యాడు. శత్రు దుర్భేద్యమైన అప్పటి కట్టడాలు ఇప్పటికీ వాటి నిర్మాణ చాతుర్యాన్ని చాటుతున్నాయి.
- సిర్నాపల్లి సంస్థానం
జిల్లాలో సిర్నాపల్లి సంస్థానానికి ప్రత్యేకత ఉంది. నిజాం నవాబు కాలంలో రాణి జానకీబాయి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఇప్పటికీ అజరామరం. 1859 నుంచి 1920 వరకు సిర్నాపల్లి సంస్థానాన్ని ఆమె పాలించారు. చెరువులు, ఆనకట్టలు, కుంటలు, బావులు, కాలువలు కట్టించారు. ఆమె ఇందల్ వాయి, నిజామాబాద్ లోని సిర్నాపల్లి గడి, కోటగల్లిగడి, మహబూబ్ గంజ్ లోని క్లాక్ టవర్ కట్టడం తదితర నిర్మాణాలు, జానకంపేట, నవీపేట, రెంజల్ దాకా 100 గ్రామాల్లో పరిపాలన సాగించారు. సికింద్రాబాద్-నిజామాబాద్ రైల్వేలైనును నిజాం నవాబు ఉప్పల్ వాయి, డిచ్ పల్లిల మీదుగా వేస్తే, ఈమె ఆ లైనును తన సిర్నాపల్లి మీదుగా వెళ్ళేలా వేయించుకున్నారు.
- దోమకొండ సంస్థానం
ప్రాచీన సంస్థానాల్లో పేరెన్నికగన్నది దోమకొండ. పాకనాటి రెడ్డశాఖకు చెందిన కామినేని వంశస్థులు ఈ సంస్థానాధీశులు. 1636లో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షాహి కామారెడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు వారి వంశీయుల పేర్లయిన కామారెడ్డి, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, పద్మాజివాడి, తుక్కోజివాడి, తిమ్మోజివాడిల మీదనే వెలిశాయి. సంస్థానంలోని కట్టడాలు శిల్పకళా సంపదను సాక్షాత్కరిస్తాయి. కోట, అద్దాల బంగళా, రాజుగారి భనాలు, అశ్వగజ శాలలు, కుడ్యాలు, బురుజులు, కందజం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఈ అద్దాల మేడలోనే కామినేని వంశీయులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించేవారు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ పనులు జరగడంతో చారిత్రక సంపదను కాపాడుకున్నట్లయింది.
[మార్చు] స్వాతంత్ర్య పోరాటంలో నిజామాబాదు
'కోటి రతనాల వీణ నా తెలంగాణ' అంటూ దాశరథి ఎలుగెత్తి చాటింది నిజామాబాద్ లోని ఖిల్లా జైలులో. తెలంగాణ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న రాజకీయ ఖైదీలను ఇక్కడి ఖిల్లా జైలులోనే నిర్భంధించేవారు. అందుకే దాన్ని 'సియాసీయోంకా ఖబరస్థాన్'(రాజకీయ ఖైదీల బొందలగడ్డ)గా అభివర్ణించేవారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నిజాం రాజు ఆధీనంలోని హైదరాబాద్ రాష్ట్రానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. నిజాం భారతదేశంలో తన రాష్ట్రాన్ని విలీనం చేయడానికి ససేమిరా అన్నాడు. ఫలితంగా తెలంగాణ ప్రాంతం విమోచన కోసం ఉద్యమాలు జరిగాయి. అందులో జిల్లా పాత్ర ఎనలేనిది.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 13 నెలలపాటు తెలంగాణ ప్రాంత వాసులపై నిజాం క్రూరమైన అణచివేతను అమలు చేశాడు. ఆయన్ను వ్యతిరేకించిన వారినందరినీ ఖిల్లా జైలులో నిర్బంధించాడు. నిజాం ఆధ్వర్యంలోని రజాకర్లు చేసిన అత్యాచారాలు అన్నీ ఇన్నీ కావు. వాటినన్నిటిని ఓర్చుకుని తెలంగాణ విముక్తి కోసం పాటుపడిన వారు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
- విముక్తిబాటలో ముఖ్య ఘట్టాలు.
- నిజాంకు వ్యతిరేకంగా 1937లో నిజామాబాద్ లోని కంఠేశ్వర్ లో ఆరో ఆంధ్ర మహాసభ జరిగింది.
- 1939 జనవరి 30న జరిగిన హైదరాబాద్ నిరసన దినం నిజామాబాద్ లోనూ నిర్వహించారు.
- నిజాం రజాకర్లను వ్యతిరేకించడంలో జిల్లా ఆర్యసమాజ్ పాత్ర ఎనలేనిది. దీని విస్తృతి రజాకార్లకు మింగుడుపడ లేదు. 1939లో రాధాకృష్ణ అనే ఆర్యసమాజ్ కార్యకర్తను(ఇప్పటి గాంధిచౌక్) పోలీసు స్టేషన్ ఎదుటే కత్తులతో పొడిచి చంపారు.
- జిల్లాలో ఆర్యసమాజ్, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పోరాటాలు జరిగాయి.
- కామారెడ్డి, ఆర్మూర్, భిక్కనూరు ప్రాంతాల్లో ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో నిజామాబాద్, బోధన్ పరిసర ప్రాంతాలలో ఆర్యసమాజ్, నిజామాబాద్, బాల్కొండ ప్రాంతాలలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిజాం వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి.
- 1943లో నిజామాబాద్ లో గణపతి కాశీనాథశాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన ఆర్యసమాజ్ మహాసభలో తెలంగాణలో బాధ్యతాయుతమైన ప్రభుత్వ స్థాపన జరగాలని తీర్మానించారు.
- కామారెడ్డి తాలూకాలోని అటవీ గ్రామాల్లో మంచిప్ప, బాన్సువాడ ప్రాంతాల్లో దళాలు తమ కార్యకలాపాలను సాగించాయి.
- హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ను నిషేధిస్తున్నట్లు నిజాం ప్రకటించడంతో నిరసనలు మిన్నుముట్టాయి.
- సత్యాగ్రహమే ఆయుధంగా వేలమంది విద్యార్థులు జిల్లా కేంద్రంలోజాతీయ త్రివర్ణ పతాకాన్ని చేబూని నిజాం వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రదర్శన జరిపారు. నిజాం ప్రభుత్వం దాదాపు 150 మందికి పి.డి. చట్టం ప్రయోగించి జైలుపాలు చేసింది.
[మార్చు] నిజామాబాదు మండలాలు
భౌగోళికంగా నిజామాబాదు జిల్లాను 36 రెవిన్యూ మండలాలుగా విభజించినారు.[1]
1.రెంజల్
2.నవీపేట్ 3.నందిపేట్ 4.ఆర్మూరు 5.బాలకొండ 6.మోర్తాడ్ 8.భీమ్గల్ 9.వేల్పూరు 11.మాక్లూర్ |
13.యెడపల్లె
14.బోధన్ 15.కోటగిరి 16.మద్నూరు 17.జుక్కల్ 18.బిచ్కుంద 19.బిర్కూర్ 20.వర్ని 21.డిచ్పల్లి 22.ధర్పల్లి 23.సిరికొండ 24.మాచారెడ్డి |
25.సదాశివనగర్
26.గాంధారి 27.బాన్స్వాడ 28.పిట్లం 29.నిజాంసాగర్ 30.యెల్లారెడ్డి 32.లింగంపేట 33.తాడ్వాయి 34.కామారెడ్డి 35.భిక్నూర్ 36.దోమకొండ |
[మార్చు] మూలాలు
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్సైటులో నిజామాబాదు జిల్లా తాలూకాల వివరాలు. జూలై 28, 2007న సేకరించారు.
[మార్చు] బయటి లింకులు
ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు | |
---|---|
అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు |