పంచవర్ష ప్రణాళికలు
వికీపీడియా నుండి
-
క్ర.సం. ప్రణాళిక వ్యవధి 1 మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-1956 2 రెండో పంచవర్ష ప్రణాళిక 1956-1961 3 మూడవ పంచవర్ష ప్రణాళిక 1961-1966 4 నాల్గవ పంచవర్ష ప్రణాళిక 1969-1974 5 ఐదవ పంచవర్ష ప్రణాళిక 1974-1979 6 ఆరవ పంచవర్ష ప్రణాళిక 1980-1985 7 ఏడవ పంచవర్ష ప్రణాళిక 1985-1989 8 ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక 1992-1997 9 తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక 1997-2002 10 పదవ పంచవర్ష ప్రణాళిక 2002-2007 11 పదకొండవ పంచవర్ష ప్రణాళిక 2007-2012
1947 లో స్వాతంత్రం పొందిన భారతదేశానికి ప్రధాన మంత్రి గా పగ్గాలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ సోవియట్ యూనియన్ (పూర్వపు రష్యా) ప్రభావానికి లోనై భవిష్యత్తు అభివృద్ధికి మనదేశంలో కూడా ప్రణాళికలు ఉండాలని తలచి ప్రణాళికా సంఘం ను ఏర్పర్చి 1951-52 నుండి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించాడు. ఈ విధంగా మనదేశంలో పంచవర్ష ప్రణాళికలకు జవహర్ లాల్ నెహ్రూ ను పితామహుడిగా పేర్కొనవచ్చు. పార్లమెంటులో ప్రణాళికల గురిమ్చి మాట్లాడుతూ నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని పెంచుతూ, ఉత్పత్తి రంగాలను ప్రభుత్వపరం చేస్తూ వీటి ఫలితాలను ప్రజలకు అందేలా చేయాల్సి ఉంది. ప్రజాస్వామ్య స్థాపనకు దోహదం చేస్తూ ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో ప్రగతిని సాధించడమే ఆర్థికప్రణాళికల ముఖ్యోద్దేశ్యం అని పేర్కొన్నాడు. దేశ వనరులు, అవసరాలను రూపొందించేందుకు 1950 లో ప్రణాళిక సంఘం ఏర్పడింది. ఇంతవరకు మనదేశంలో 10 పంచ వర్ష ప్రణాళికలు పూర్తి కాగా ప్రస్తుతం 11 వ పంచ వర్ష ప్రణాళిక ప్రారంభ దశలో ఉంది. ప్రణాళిక సంఘానికి ప్రధాన మంత్రి ఎక్స్-అఫీషియో చైర్మెన్ గా వ్యవహరిస్తాడు, కాగా కేబినేట్ ర్యాంకు కల డిప్యూటీ చైర్మెన్ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతాడు. ప్రస్తుతం ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మెన్ గా మాంటెక్ సింగ్ అహ్లువాలియా కొనసాగుతున్నారు.
[మార్చు] ప్రణాళిక వ్యవస్థ పూర్వరంగం
మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934 లో రచించిన ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా భారతదేశంలో ప్రణాళిక వ్యవస్థకు దారిచూపింది. కాబట్టి అతనిని దేశ ప్రణాళిక వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణించవచ్చు. ఈ గ్రంథంలో విశ్వేశ్వరయ్య దేశంలో తాండవిస్తున్న పేదరికం, నిరుద్యోగం వంటి అనేక ఆర్థిక సమస్యలకు కారణం ప్రణాళికబద్దమైన పద్దతి లేకపోవడమే కారణమని పేర్కొన్నాడు. 1938 లో దేశంలో జాతీయ ప్రణాళిక కమిటీని స్థాపించారు. 1944 లో బాంబే ప్రణాళిక రూపకల్పన జర్గింది. జాతీయ నాయకులైన దాదాభాయి నౌరోజీ, ఎం.జి.రణడే, శ్రీమన్నారాయణ, ఎం.ఎన్.రాయ్ తదితరులు తమ రచనల ద్వారా, ఇతరేతర కృషి ద్వారాభారత ప్రణాళికా విధానం మూల భావాలను సమగ్రంగా రూపొందించారు. అయిననూ దీని ఒక నిర్దుష్ట రూపం ఇచ్చినది మాత్రం జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పవచ్చు. 1950 లో ఆర్థిక సంఘం స్థాపించబడింది. 1952 డిసెంబర్ లో మొదటి పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను పార్లమెంటు ఆమోదించింది.
[మార్చు] మొదటి పంచవర్ష ప్రణాళిక
1951-52 నుంచి 1955-56 వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక అమలులో ఉంది. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ డిసెంబర్ 8, 1951 న పార్లమెంటు లో మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టినాడు. ఈ ప్రణాళిక మొత్తం కేటాయింపులు 2068 కోట్ల రూపాయలు. ఇందులో నీటిపారుదల, ఇంధనానికి 27.2%, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కి 17.4%, రవాణా, ప్రసార సాధనాలకు 24%, పారిశ్రామిక రంగానికి 8.4%, సాంఘిక సేవలకు 16.64%, కేటాయింపులు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం, దేశ విభజన వల్ల దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని వృద్ధిచేయడంతో పాటు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కోసం పథకాలను చేపట్టాలనే లక్ష్యాల కోసం ఈ ప్రణాళికను రూపొందించారు. 1951 లో ఆహార ధాన్యాలను అధికంగా దిగుమతి చేసుకోవడంతో వ్యవసాయరంగాన్ని స్వావలంబన చేయాలనే ఉద్దేశ్యంతో ఈ రంగానికి పెద్ద పీఠ వేసి అధిక శాతం నిధులు కేటాయించారు. చివరి రెండు సంవత్సరాలు మంచి వర్షపాతం కురియడం, తద్వారా పంట ఉత్పత్తి పెర్గడంతో ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగం విజయవంతమైందని చెప్పవచ్చు. ఈ ప్రణాళిక కాలంలో స్థూల దేశీయోత్పత్తి లో 2.1% వృద్ధి సాధించాలనే లక్ష్యం ఉండగా అంతకు మించి 3.6 లక్ష్యం సాధించబడినది. ఈ కాలంలో నికర దేశీయోత్పత్తి 15% వృద్ధి చెందింది. దీని రుతుపవనాలు కూడా అనుకూలించడం ఒక కారణం. కాని జనాభా పెర్గుదల రేటు అధికంగా ఉండుటచే తలసరి ఆదాయం మాత్రం తక్కువ స్థాయిలో పెర్గింది. భాక్రానంగల్ ప్రాజెక్టు, హిరాకుడ్ ప్రాజెక్టు, మెట్టూరు డ్యాం వంటి పలు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించాలనే ఉద్దేశ్యానికి ప్రేరణ ఈ ప్రణాళిక కాలంలోనే కల్గింది. 1956 లో ఈ ప్రణాళిక చివరి నాటికి దేశంలో 5 ఐఐటి లి స్థాపించబడ్డాయి. ఉన్నత విద్యకు నిధులు అందజేసి బలవంతం చేయడాన్కి యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ కూడా ఈ ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు చేయబడినది. దేశంలో 5 ఉక్కు పరిశ్రమలు స్థాపించడానికి కూడా కాంట్రాక్టుల పైన ఈ ప్రణాళిక కాలంలోనే సంతకాలు తీసుకున్నప్పటికీ, ఉక్కు కర్మాగారాలు మాత్రం రెండో ప్రణాళిక మద్యకాలంలో ప్రారంభమయ్యాయి.
[మార్చు] రెండో పంచవర్ష ప్రణాళిక
ఈ పంచవర్ష ప్రణాళిక 1956-57 నుంచి 1960-61 వరకు కొనసాగింది. 1954 లో భారతీయ జాతీయ కాంగ్రెస్ సదస్సులో సామ్యవాద సమాజాన్ని నిర్మించాలని ప్రకటన చేసినందున రెండో ప్రణాళికలో పారిశ్రామిక రంగంపై అందులోనూ ప్రభుత్వ రంగ సంస్థలపై అధిక దృష్టి కేంద్రీకరించారు. అందకు తగినట్లుగా మహలనోబిస్ నమునాను ఏ ప్రణాళిక నమునాగా స్వీకరించారు. పరిశ్రమల ద్వారా దేశీయోత్పత్తి పెంచడానికి ప్రాత్సాహం కల్పించారు. నీటిపారుదల ప్రాజెక్టులు మరియు భిలాయ్, బొకారో, జంషెడ్పూర్ లాంటి చోట్ల భారీ ఉక్కు కర్మాగారాలను ఈ ప్రణాళిక కాలంలోనే ప్రారంభించారు. బొగ్గు ఉత్పత్తిని కూడా పెంచబడినది.ఉత్తర భారతదేశంలో నూతన రైలు మార్గాలు కూడా ప్రారంభించబడ్డాయి. హోమీ-జే-భాభా చైర్మెన్ గా 1957 లో అణు ఇంధన సంస్థ (Atomic Energy Commission) కూడా ఏర్పాటు చేయబడింది. పరిశోధనా సంస్థగా టాటా ఇన్స్టిట్యూట్ ఆప్ ఫండమెంటల్ రీసెర్చి కూడా ఈ ప్రణాళికలోనే స్థాపించబడింది.
[మార్చు] మూడవ పంచవర్ష ప్రణాళిక
ఈ పంచవర్ష ప్రణాళిక 1961-62 నుంచి 1965-66 వరకు కొనసాగింది. స్వయం సమృద్ధి లక్ష్యంతో ముఖ్యంగా వ్యవసాయ రంగం లో, మౌళిక పరిశ్రమల రంగంలో ఉత్పత్తులు పెంచాలని ఈ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించి దీనిని ప్రారంభించారు. మూడవ ప్రణాళిక వ్యయం 8577 కోట్ల రూపాయలు. రెండో ప్రణాళికలో భారీ పరిశ్రమలను ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగంలో ధరలు పెర్గినందువల్ల ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేయబడింది. భారతదేశ వ్యవసాయ రంగంలోనే విప్లవాత్మకమైన సస్యవిప్లవం (Green Revolution) ఈ కాలం లోనే ప్రారంభించబడింది. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఈ ప్రణాళికా కాలం లోనూ కొనసాగింది. పలు చోట్ల సిమెంటు మరియు ఎరువుల కర్మాగారాలు స్థాపించబడ్డాయి. సస్యవిప్లవం ప్రభావం వల్ల పంజాబ్ లో గోధుమల ఉత్పత్తి గణనీయంగా పెర్గింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలలు విరివిగా స్థాపించబడి విద్యావకాశాలను మెరుగుపర్చబడింది. క్రింది స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని బలొపేతం చేయడానికి పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. పలు రాష్ట్రాలలో విద్యుత్తు బోర్డులను స్థాపించి గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు విద్యుత్ సరఫరా మెరుగు పర్చబడింది. ఇన్ని సౌకర్యాలు కల్పించబడినప్పటికీ మూడవ పంచవర్ష ప్రణాళిక చివరికి విఫలమైంది. దీనికి ప్రధాన కారణం చైనా యుద్ధం, రుతుపవనాల తిరోగమనం. ఈ రెండింటి కారణాళ వల్ల ఆహార ధాన్యాల ధరలు పెరిగి, విదేశీ మారక నిల్వలు తగ్గి, అప్పుల భారం పెరిగింది.
[మార్చు] ప్రణాళిక సెలవు
చైనా తో యుద్ధం మూలంగా మరియు వ్యవసాయ రంగంలో అనుకున్న ఫలితాలను సాధిమ్చనందు వల్ల వెంటనే నాల్గవ ప్రణాళిక ప్రారంభించడం అసాధ్యమని భావించిన ప్రభుత్వం 1966-69 వరకు ప్రణాళిక సెలవు గా ప్రకటించింది. 1966-69 కాలానికి 3 వార్షిక ప్రణాళికలను రూపొందించింది. ఈ కాలంలో రుతుపవనాలు కరుణించి అంచి వర్షపాతాన్ని కురిపించడంతో వ్యవసాయ ఉత్పత్తులు పెర్గి, ధరలు తగ్గి మళ్ళీ భారత ఆర్థిక వ్యవస్థ పూర్వపు స్థాయికి చేరింది.
[మార్చు] నాల్గవ పంచ వర్ష ప్రణాళిక
ఈ ప్రణాళిక 1969-70 నుంచి 1973-74 వరకు కొనసాగింది. సుస్థిరమైన అభివృద్ధి సాధించడం ఈ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించారు. వ్యవసాయ రంగంలో రైతులకు తగినంత రుణాలను అందించడానికి దేశంలోని ప్రముఖ పెద్ద బ్యాంకులను ఇందిరా గాంధీ ప్రభుత్వం జాతీయం చేసింది. పాకిస్తాన్ తో యుద్ధం మరియు బంగ్లాదేశ్ శరణార్థుల సమస్య ఈ ప్రణాళికపై భారం మోసింది. పారిశ్రామిక అభివృద్ధి కోసం కేటాయించబడిన నిధులను యుద్ధం కోసం ఖర్చు చేయవలసి వచ్చింది. బుద్ధుడు నవ్వాడు అనే సంకేతంతో రాజస్థాన్ ఎడారిలోని పోఖ్రాన్ లో అణుపరీక్షలు చేయడంతో అమెరికా ఆగ్రహానికి గురై ఆ దేశ సహాయంలో కూడా కోతపడింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ ప్రణాళిక విఫలమైంది. అయిననూ ఈ ప్రణాళికలో అనేక గ్రామీణాభివృద్ధి పథకాలను చేపట్టడంతో పేదరిక నిర్మూలనకు, ఉపాధి అవకాశాలకు దోహదపడింది. పారిశ్రామిక రంగంలో 9% వృద్ధిరేటు సాధించాలనే లక్ష్యం కలగానే మిగిలిపోయింది.
[మార్చు] ఐదవ పంచ వర్ష ప్రణాళిక
ఈ ప్రణాళిక 1974-75 నుంచి 1978-79 కాలంలో చేపట్టబడింది. గ్రామీణాభివృద్ధి మరియు స్వయం సమృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడిన ఈ ప్రణాళిక మురార్జీ దేశాయ్ నాయకత్వం లోని జనతా ప్రభుత్వం ఒక సంవత్సరం ముందుగానే నిల్పివేసింది. ద్రవ్యోల్బణం ను తగ్గించడానికి ఈ ప్రణాళిక మంచి కృషి చేసింది. ఐదవ పంచవర్ష ప్రణాళిక యొక్క మొత్తం పెట్టుబడి 53411 కోట్ల రూపాయలు. ఈ ప్రణాలిక కాలంలోనే దేశ రాజకీయాలలో విపరీత పరిణామాలు సంభవించాయి. ఇందిరా గాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ని విధించడం ఈ కాలంలోనే జర్గింది. ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కల్గించాయి. ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన మురార్జీ ప్రభుత్వం ఈ ప్రణాళికను రద్దు చేసి నిరంతర ప్రణాళికలను (Rolling Plans) ప్రారంభించింది.
[మార్చు] రోలింగ్ ప్లాన్స్
కేంద్రంలో ప్రభుత్వం మారడంతో ఇందిర ప్రభుత్వం ప్రారంభించిన ప్రణాలికను అర్థాంతరంగా ముగించి జనతా పార్టీ లక్ష్యాలతో మురార్జీ ప్రభుత్వం నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టింది. ప్రముఖ ఆర్థిక వేత్త డి.టి.లక్డావాలా ను ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మెన్ గా నియమించారు. ఈ ప్రణాళికనే ఆరవ ప్రణాళికగా భావించారు. కాని కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో దీన్ని కూడా రద్దుచేసి 1980 నుంచి ఆరవ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు.
[మార్చు] ఆరవ పంచ వర్ష ప్రణాలళిక
ఈ ప్రణాళిక 1980 నుంచి 1985 వరకు అమలులో ఉంది. పేదరిక నిర్మూలన ఈ ప్రణాళిక ధ్యేయం. ఈ ప్రణాళిక మొత్తం పెట్టుబడి 109291 కోట్ల రూపాయలు. అభివృద్ధి రేటు సంవత్సరానికి 5.2% గా నిర్ణయించారు. ఈ ప్రణాళిక కాలంలో పలు ఉపాధి నిర్మూలన కార్యక్రమాలను చేపట్టడం జర్గింది. ఐ.ఆర్.డి.పి. ట్రైసెమ్, యన్.ఆర్.ఇ.పి అందులో ముఖ్యమైనవి. ఈ ప్రణాళిక కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెర్గడంతో పాటు అనుకున్న వృద్ధిరేటు కూడా సాధించడం జర్గింది. ఈ ప్రణాళికలో ఇంధన రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినారు. వ్యవసాయరంగానికి, పరిశ్రమలకు అవస్థాపనా సౌకర్యాలను అభివృద్ధి పరుచుట, గ్రామీణ రంగాలలో ఉపాధి సౌకర్యాలు కల్పించుట వ్యూహంగా నిర్ణయించినారు. ఆర్థిక, సాంకేతిక రంగాలలో స్వావలంబన మరియు పేదరికం, నిరుద్యోగం నిర్మూలన మొదలగునవి ఈ ప్రణాళిక లక్ష్యాలు.
[మార్చు] ఏడవ పంచ వర్ష ప్రణాళిక
ఈ ప్రణాళిక 1985 లో ప్రారంభమై 1990 వరకు కొనసాగింది. రాజీవ్ గాంధీ హయంలో తయారైన ఈ ప్రణాళికలో ఆహారోత్పత్తి మరియు ఉపాధి అవకాశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 20 వ శతాబ్దంలోకి పయనం అనే నినాదంతో దేశ భవష్యత్తు అవసారాల్ను దృష్టిలో ఉంచుకొని తయారుచేయబడిన ప్రణాళిక ఇది.శాస్త్ర, సాంకేతిక రంగాలలో గణనీయమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పేదరిక నిర్మూలన, నిరక్ష్యరాస్యత నిర్మూలన, మౌళిక సదుపాయాలు కల్పించడం దీని ఉప లక్ష్యాలు. ఏడవ ప్రణాళిక మొత్తం పెట్టుబడి 218729 కోట్ల రూపాయలు. ఈ ప్రణాళిక కాలంలోనే జవహర్ రోజ్గార్ యోజన ను ప్రారంభించారు. ఈ యోజన వివిధ రకాల పేర్లు మార్చుకొని ఇప్పటివరకు కూడా అమలులో ఉంది. ఈ ప్రణాళికలో నిర్ణయించిన లక్ష్యాలు సాధించినందువల్ల ఏడవ పంచవర్ష ప్రణాళిక విజయవంతమైందని చెప్పవచ్చు.
[మార్చు] ఎనిమిదవ పంచ వర్ష ప్రణాళిక
ఏడవ ప్రణాళిక అంతం తర్వాత దేశంలో రాజకీయ అస్థిరత వల్ల ఎనిమిదవ ప్రణాళిక ప్రారంభించడానికి రెండు సంవత్సరాల ఆలస్యం అయింది. చివరికి 1992 ఏప్రిల్ 1 న ఈ ప్రణాళిక పట్టాలకెక్కింది. ఈ ప్రణాళిక పెట్టుబడి 7,98,000 కోట్ల రూపాయలు, ఇందులో పబ్లిక్ రంగం వాటా 4,34,000 (మొత్తం ప్రణాళిక పెట్టుబడిలో 45%). 1997 మార్చి 31 వరకు అమలులో ఉన్న ఈ ప్రణాళిక లక్ష్యాలు వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి, ఏటా 5.6% అభివృద్ధి రేటు సాధించడం, ఎగుమతులు స్థూల జాతీయోత్పత్తిలో 13.6% పెర్గడం, దిగ్య్మతుల రేటు 8.4% కి పరిమితం చేయడం, పొదుపు 21.6% దాకా ఉంచడం, జనాభా పెర్గుదల రేటు తగ్గించడం నిరక్ష్యరాస్యత నిర్మూలన మొదలైనవి.
[మార్చు] తొమ్మిదవ పంచ వర్ష ప్రణాళిక
తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక 1997 ఏప్రిల్ 1 నుంచి 2002 మార్చి 31 వరకు అమలులో ఉంది. ఈ ప్రణాళిక మొత్తం పెట్టుబడి 2190000 కోట్ల రూపాయలు. ఈ ప్రణాళిక లక్ష్యాలు పేదరిక నిర్మూలన, వ్యవసాయ రంగ అభివృద్ధి, ద్రవ్యోల్బణ నిర్మూలన, ప్రాథమిక ఆరోగ్య వసతులు మెరుగు పర్చడం, స్థానిక సంస్థల అభివృద్ధి, జనాభా నియంత్రణ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం మొదలగునవి.
[మార్చు] పదవ పంచ వర్ష ప్రణాళిక
ఈ ప్రణాళిక ఏప్రిల్ 1, 2002 నుంచి మార్చి 31, 2007 వరకు కొనసాగింది. 10 వ ప్రణాళికలో ఆర్థికవృద్ధి రేటు లక్ష్యం 7.6% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళికలొ వ్యవసాయ రంగం 2.13 వృద్ధిరేటు నమోదైంది. పారిశ్రామికరంగం లో 8.74%, సేవల రంగంలో 9.28% వృద్ధిరేటు నమోదైంది.
[మార్చు] పదకొండవ పంచ వర్ష ప్రణాళిక
పదకొండవ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను జాతీయ ప్రణాళిక సంఘం నవంబర్ 2007 లో ఆమోదించింది. 2007 నుంచి 2012 కాలంలో అమలయ్యే ఈ ప్రణాళికలో ఆర్థిక వృద్ధి రేటును 9% కు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రాధాన్య రంగాల కార్యక్రమాల్లో పెటుబడులను గణనీయంగా పెంచడం ద్వారా మరింత సమగ్రంగా అభివృద్ధి సాధించాలని ప్రణాళికలో నిర్దేశించారు.
ప్ర్రణాళికా ముసాయిదా ముఖ్యాంశాలు : 11 వ పంచవర్ష ప్రణాళిక మొత్తం పెట్టుబడి 36,44,000 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ప్రణాళిక అమలు కోసం కేంద్రం కేటాయించాల్సిన స్థూల బడ్జెటరీ మద్దతు 14,21,711 కోట్ల రూపాయలు. ఇది గత ప్రణాళిక కంటే 6,00,000 కోట్లు అధికం. ప్రధానంగా ఈ ప్రణాళికలో సామాజిక, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టారు. ప్రాధాన్య రంగాలకు స్థూల బడ్జెట్ లో 74.67% కు పెంచారు. గత ప్రణాళికలో ఇది 55.2% మాత్రమే. విద్యారంగానికి ఈ ప్రణాళికలో మంచి కేటాయింపులు చేశారు. స్థూల బడ్జెట్ లో దీని వాటా 19.36%. దీని ప్రకారం ఈ ప్రణాళిక కాలంలో విద్యకై 2,75,000 కోత్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 4% గా నిర్ణయించారు.పారిశ్రామిక, సేవల రంగం వృద్ధి రేటును 9-11% గా నిర్ణయించారు.
[మార్చు] ప్రణాళికల విజయాలు
1947 లో కొత్తగా స్వాతంత్రం పొందిన మనదేశం ప్రతి అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడే అవసరం లేకుండా ప్రణాళిక బద్దంగా రూపొందిన లక్ష్యాల ఆధారంగా అభివృద్ధిని సాధించడం పంచవర్ష ప్రణాళికల విజయమేనని చెప్పవచ్చు. ప్రారంభంలో ఎన్ని ఆటంకాలు ఎదురైననూ అభివృద్ధిపథం వైపు పయనించడానికి ప్రణాళికలు కృషిచేశాయి. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తి సాధించగల్గాము. రెండో ప్రణాళికలో భారీ పరిశ్రమలకు మంచి ఊతం లభించింది. మూడో ప్రణాళిక విఫలమవడానికి చైనా యుద్ధం (1962), నెహ్రూ మరణం (1964), పాకిస్తాన్ తో యుద్ధం (1965)కారణాలు. ఆ తర్వాత కూడా రుతుపవనాలు, దేశ రాజకీయ కారణాలు మొదలగునవి ప్రణాళికల అభివృద్ధిని తాత్కాలికంగా ఆపినా దేశ అభివృద్ధిని మాత్రం అడ్డగించలేవు. ఈనాడు దేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్నదానికి, సమాచార, శాస్త్ర, సంకేతిక, అంతరిక్ష రంగాలలో అంతెత్తున ఎగిరినదానికి ప్రణాళికబద్ద లక్ష్యాలే కారణం. పారిశ్రామికంగా కూడా బాగా అభివృద్ధి సాధించాం. ఒకప్పుడు అహారధాన్యాలకై ఇతరదేశాలపై ఆధారపడిన భారతదేశం ఈనాడు ఎగుమతి దశకు చేరడానికి, పారిశ్రామిక మరియు రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రణాళికలు దోహదం చేశాయి.
[మార్చు] ప్రణాళికల వైఫల్యాలు
పంచవర్ష ప్రణాళికల వల్ల ఎన్నో విజయాలు సాధించిననూ అవి నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు చూస్తే ఎన్నో అపజయాలు, వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనబడతాయి. 6 దశాబ్దాల ప్రణాళికా భారతి ఏమి సాధించిందో గ్రామీణ రంగాన్ని ఒక్కసారి చూస్తే అర్థమౌతుంది. గత 60 సంవత్సరాలుగా కోట్ల రూపాయలు దారిద్యం, నిరుద్యోగం, జనాభా నిర్మూలన, అద్యోగ అవకాశాలపై ఖర్చు చేస్తున్ననూ అవి మరింతగా పెర్గడం ఆశ్చర్యం కల్గుతుంది. ఇప్పటికీ పేదవారికి వారి జీవితాలలో మార్పేమీ లేదని పలు ఆర్థిక విశ్లేషణలు తెల్పుతున్నాయి. అంకెల్లో ప్రగతి బాగున్ననూ వాటి ఫలాలు మాత్రం కొందరే అనుభవిస్తున్నారు. అంతేకాకుండా ప్రణాళికలకు ఒక స్థిరమైన గమ్యంలేదని, రాజకీయ పార్టీలు తమ వాగ్దానాల కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం ప్రణాళిక లక్ష్యాలను మార్చివేస్తున్నారనే అపవాదు ఉంది. మొదటి , రెండో ప్రణాళికలో పొమ్దుపర్చిన లక్ష్యాలనే 11 వ ప్రణాళికలో కూడా ఉండటం ఖచ్చితంగా ప్రణాళికా వైఫల్యమేనని చెప్పవచ్చు. ప్రణాళికా వ్యయంలో కూడా అధిక భాగం పనికిరాని పథకాల మీద, సబ్సిడీల మీద వెచ్చిస్తున్నారు. దాంతో రుణభారం మరింతగా పెరిగి భవిష్యత్తు భారం అవుతుంది. నాల్గవ ప్రణాళిక అనంతరం చెప్పుకోదగ్గ భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం జరుగలేదు. వ్యవసాయరంగంలో తాత్కాలిక ఫలితాల సాధనకే ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలో అధిక ప్రాంతాలు నేటికీ వ్యవసాయం పైనే ఆధారపడవల్సిన పరిస్థితి పోలేదు. దేశంలో సమతూలక అభివృద్ధి ఏర్పడలేదు.
[మార్చు] బయటి లింకులు
- ప్లానింగ్ కమిషన్ వారి అధికారిక వెబ్ సైటు
- ప్లానింగ్ కమిషన్ వారి అధికారిక వెబ్ సైటు మరొక అడ్రస్
- ఐ.ఐ.ఎమ్. అహమ్మదాబాదు వారి 'డెవలెప్మెంట్ ఫస్ట్' సైటు
- ఢిల్లీ ప్లానింగ్ డిపార్ట్మెంట్
- యు.ఎన్.డి.పి. ఇండియా
- న్యూ సెంచురీ పబ్లికేషన్స్ వారి సైటు
|
|
---|---|
చరిత్ర | భారతీయ చరిత్ర కాలసూచిక, సింధు లోయ నాగరికత, మేలుహ్హా, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం, భారతదేశంలో గ్రీకుల దండయాత్రలు, మౌర్య వంశం, అశోకుడు, శుంగ వంశం, శాతవాహనులు, ఇండో గ్రీకు సామ్రాజ్యం, ఇండో స్కిథియనులు, ఇండో పార్థియన్ సామ్రాజ్యం, కుషాణు సామ్రాజ్యం, పశ్చిమ క్షాత్రపులు, గుప్త సామ్రాజ్యం, పాల సామ్రాజ్యం, భారత్లో ఇస్లాము సామ్రాజ్యాలు, మొగలు యుగం, మరాఠా సామ్రాజ్యం, బ్రిటిషు రాజ్, బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ, భారత గవర్నర్ జనరల్, భారత వైస్రాయి, ప్రథమ భారత స్వాతంత్ర్య సమరం, భారత స్వాతంత్ర్య సమరం, క్విట్ ఇండియా ఉద్యమం, భారత విభజన, అలీనోద్యమం, చైనా భారత యుద్ధం, భారత పాక్ యుద్ధం 1947, భారత పాక్ యుద్ధం 1965, భారత పాక్ యుద్ధం 1971, కార్గిల్ యుద్ధం, భారత సైన్యం, భారత జనాభా వివరాలు, భారతీయ తపాల చరిత్ర |
రాజకీయాలు | జాతీయతా సూచికలు, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం, రాజకీయ పార్టీల చరిత్ర (భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్), విదేశీ సంబంధాలు, ఎన్నికలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు |
ప్రభుత్వం | భారత ప్రభుత్వ ఏజన్సీలు, శాసన విభాగం (లోక్ సభ, రాజ్య సభ) కార్య నిర్వాహక విభాగం (రాష్ట్రపతి & ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత మంత్రివర్గం, భారత అటార్నీ జనరల్, భారత ఎన్నికల కమిషను, భారత విదేశీ వ్యవహారాల మంత్రి; భారత్లో వట్టాల అమలు: సి.బి.ఐ, సి.ఐ.డి, భారత నిఘా సంస్థలు: ఐ.బి, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్), న్యాయ విభాగం (సుప్రీం కోర్టు), భారత సైనిక దళాలు (భారత సైన్యం, భారత నావికా దళం, భారత వైమానిక దళం, సరిహదు భద్రతా దళం, భారత తీరరక్షక దళం) |
భౌగోళిక స్వరూపం | హిమాలయాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, గంగా మైదానము, దక్కను పీఠభూమి, థార్ ఎడారి, గంగ, కచ్, బ్రహ్మపుత్ర, ఈశాన్య భారతం; భారత్ పర్వతాల జాబితా, భారత లోయల జాబితా, భారత ద్వీపాల జాబితా, భారత నదుల జాబితా; భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, భారత నగరాలు, పట్టణాల జాబితా, భారత జిల్లాల జాబితా, భారత ప్రాంతాల జాబితా |
ఆర్ధికం | పంచవర్ష ప్రణాళికలు, భారత రూపాయి, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, భారత్లో జీవన ప్రమాణాలు, భారత కంపెనీలు, భారతీయ రిజర్వ్ బాంక్ |
జనాభా | భారతీయ భాషలు, భారత్లో జీవన ప్రమాణం, భారత్లో మతము |
భారత కళలు, వినోదం & భారతీయ సంస్కృతి | భారతీయ సంగీతం (కర్ణాటక సంగీతం, హిందూస్థానీ సంగీతం, ఇండి పాప్), భారతీయ సినిమా & భారత్లో టెలివిజన్ (హిందీ సినిమా, తెలుగు సినిమా), భారత టెలివిజన్ స్టేషన్ల జాబితా, భారతీయ సాహిత్యం, భారతీయ వంటలు, భారత్లో సెలవులు, జానపద భారతం, భారత శాస్త్రీయ నాట్యం, భారతీయ శిల్పకళా; భారత్లో విద్య, భారతీయ భాషలు, భారత్లో మాధ్యమాలు |
ఇతరాలు | కాశ్మీరు తీవ్రవాదం, భారతీయ ఇంగ్లీషు, భారత జాతీయతా చట్టం, డూల్ చితిజెన్షిప్, భారతీయ సంఖ్యా మానము, ఇస్రో, భారత సమాచార వ్యవస్థ, భారత రవాణా వ్యవస్థ (భారత హైవేలు, రైల్వేలు, ఆటో రిక్షా), భారత జాతీయ పతాకం, భారత పర్యాటక రంగం, భారత వార్తా వనరులు, భారత వాహన లైసెన్సులు |