గోల్కొండ
వికీపీడియా నుండి
గోల్కొండ ఒక శిధిలమయిన కోట మరియు నగరము. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాదు నగరమునకు 11 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరము మరియు కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్ధం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. 1143లలో ఈ ప్రాంతాన్ని కాకతీయులు పాలిస్తూ ఉండేవారు. 200 సంవత్సరముల తరువాత వారినుండి బహమనీ సుల్తాను వశము చేసుకున్నాడని కధనం. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1364-1512) ఉండేది, కానీ 1512 తరువాత ముస్లిము సుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడినది.
గోల్కొండ అధికారులు, సైన్యం, పాలకుల కుటుంబాలు నివసించేటంత పెద్దగా ఉండేది. అక్కడ మసీదులు మరియు కోటల శిధిలాలు కూడా ఉంటాయి. అన్నీ బాగున్న రోజులలో అక్కడ వజ్రాలు దొరికేయి, గోల్కొండ ధనమునకు పర్యాయ పదముగా కూడా నిలిచింది.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
"గొల్ల కొండ" నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ప్రాకారం వెనుక ఒక ఆసక్తికరమయిన కధనం ఉంది. అదేమిటంటే 1143 లో మంగలవరం అనే రాళ్ళ గుట్ట పైన ఒక గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహము కనిపించినది. ఈ వార్తను అప్పటి ఆ ప్రాంతమును పాలించే కాకతీయులకు చేరవేయ బడినది. వెంటనే ఆ పవిత్ర స్థలములో రాజుగారు ఒక మట్టి కట్టడమును నిర్మించారు. 200 సంవత్సరముల తరువాత బహమనీ సుల్తానులు (1364) ఈ మట్టి కట్టడమును స్వాధీన పరుచుకున్నారు. 1507 నుండి మొదలుకొని ఒక 62 సంవత్సరముల కాలములో ఆ మట్టి కట్టడమును కుతుబ్ షాహీ వంశస్తులు పెద్ద నల్లరాతి కోటగా తయారు చేసారు. కోట బురుజులతో సహా ఇది 5 కి.మీ. చుట్టుకొలత కలిగి ఉన్నది. ఎన్నో చారిత్రక సంఘటనలకు మౌన సాక్షిగా నిలిచినది. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్తుల పాలన 1687 లో ఔరంగజేబు విజయముతో అంతమయినది. ఆసమయములొనే ఔరంగజేబు, కోటను నాశనంచేసి, శిధిలాలను మిగిల్చాడు. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి గాను ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచప్రసిద్ద కోహినూరు వజ్రము కూడా ఇక్కడినుండే వచ్చినదని చెబుతూ ఉంటారు. గోల్కొండలోని గనుల నుండి వచ్చిన ధనము నిజాము చక్రవర్తులను సుసంపన్నం చేశాయి. నిజాములు మొగలు చక్రవర్తులనుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత హైదరాబాదును 1724 నుండి 1948 లో భారత్లో విలీనమ్యేంతవరకు పాలించారు.
[మార్చు] కోటలు
గోల్కొండ నాలుగు వేర్వేరు కోటలు, 87 అర్ధ చంద్రాకారపు బురుజులతోకూడిన 10 కి.మీ. పొడవు గోడ కలిగి ఉంది; కొన్ని బురుజులలో ఇంకా ఫిరంగులను నిలిపిఉంచారు. ఇంకా 8 సింహద్వారములు, 4 ఎత్తగలిగే వంతెనలు (draw bridge), బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు మొదలగునవి చాలా ఉండేవి. సింహద్వారములలో అన్నిటికంటే కిందది మరియు అన్నిటికంటే బయట ఉండే ఫతే దర్వాజా (విజయ ద్వారము) నుండే మనము గోల్కొండ కోటను చూడటానికి వెళ్తాము. ఔరంగజేబు విజయము తరువాత ఈ ద్వారము గుండానే తన సైన్యమును నడిపించాడు. ఏనుగుల రాకను ఆడ్డుకోవటానికి ఆగ్నేయము వైపున పెద్ద పెద్ద ఇనుప సువ్వలు ఏర్పాటు చేసారు.ఫతే దర్వాజా నిర్మించటానికి ధ్వనిశాస్త్రమును ఔపోసన పట్టినట్లున్నారు. గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు ఆవల గోల్కొండలో అతి ఎత్తయిన ప్రదేశములో ఉన్న "బాలా హిస్సారు" వద్ద చాలా స్పస్టముగా వినిపిస్తుంది. ఈ విశేషమును ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాదసంకేతములు తెలుపుటకు ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా మిగిలిపోయింది.
[మార్చు] బాలా హిస్సారు దర్వాజా
అన్ని ముఖద్వారములలోకి బాలా హిస్సారు దర్వాజా చాలా మనోహరమయినది. ఆర్చీల మూల ఖాళీలలో ఉన్న సన్నటి రాతి పలకల మీద కాల్పనిక మృగాలు మరియు సింహపు బొమ్మలు ఈ రక్షణ ద్వారమునకు ప్రత్యేక అలంకారాలు. బాలా హిస్సారు దర్వాజా నుండి కొండపైకి వెళ్ళటానికి 380 ఎగుడు దిగుడు రాతిమెట్లు ఉంటాయి. ఆ మెట్లు అన్నీ ఎక్కిన తరువాత మనకు బాలా హిస్సారు బారాదరీ అని పిలవబడే ఒక మంటపము కనిపించును. దర్బారు హాలుగా ఉపయోగించే ఈ కట్టడములో 12 ఆర్చీలు, 3 అంతస్తులు ఉన్నాయి. దానిని వంపు తిరిగిన గదులుగా దృడమయిన స్థంబాలతో విభజించినారు. ఎత్తులో ఉన్న ఒక గదికి ఆనుకొని ఉన్న మూడు ఆర్చీలద్వారా వెనుక ద్వారము తెరుచుకొనును. ఒక ఎత్తయిన మిద్దెపైన మనకు రాతి సింహాసనము కనిపించును. కొండలలో విసిరేసినట్లున్న ఈ మంటపములో అబుల్ హసన్ లు తమ ఉంపుడుగత్తెలను ఉంచేవారని చాలామంది నమ్మకము. బారాదరీలో మనకు మరో విశిష్టత కనిపిస్తుంది - జంట గోడల మధ్య ఉన్న ఖాళీలు గాలిని పీల్చి, పీడనం పెరిగేటట్లుగా గదిలోనికి వదులుతూ, సహజసిద్ధమయిన కూలరు వలె ఉంటుంది.
[మార్చు] దేవాలయములు మసీదులు
హిందూ ఉద్యోగులలో ముఖ్యులయిన అక్కన్న మాదన్నల కార్యాలయములు పైన ఉన్న కుతుబ్ షాహీ దర్బారులో ఉంటాయి. అక్కడ మనము గండశిల నుండి నిర్మించిన కాకతీయుల కాలమునాటి హిందూ దేవాలయమును కూడా చూడవచ్చు. దీనిని మాదన్న దేవాలయముగా సంబోదిస్తారు. అందులో రంగులలో చిత్రించిన కాళీదేవి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఇంకో ముఖ్య కట్టడము "తారామతి" నిర్మించిన మసీదు. ఆక్కడి గండశిలల గుండా నడుస్తున్నప్పుడు మనకు బంకమట్టితో తయారుచేసిన గొట్టాలు కనిపిస్తాయి. కొండపైకి నీటి సరఫరా కోసం అప్పటి సమర్ధవంతమయిన ఏర్పాట్లకు ఇవి సాక్ష్యాలు.
1518లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా కటించిన మసీదు మూలలలో ఉండే మినారుల వలన చాలా బాగా కనిపిస్తుంది. మసీదు ప్రాంగణం కోట బురుజుల వరకు విస్తరించి ఉన్నది. మసీదుకు దగ్గరలోనే గండశిలలో ఒక చిన్న రామ మందిరము ఉన్నది. అబుల్ హసన్ తానాషా సంస్థానంలో కోశాధికారిగా పనిచేస్తున్న రామదాసును, డబ్బులు దుర్వినియోగ పరిచిన నేరంపై ఇక్కడే బంధించాడు. అప్పుడే ఆయన ఇక్కడ రాళ్ళపైన రాముడు, లక్ష్మణుడు మరియు హనుమంతుల రూపాలను చెక్కాడు.
[మార్చు] రాచమందిరాలు
ఏటవాలుగా, ఇరుకుగా ఉన్న మెట్లు కింద ఉన్న జనానాకు మరియు రాణీగారి మహలుకు దారితీయును. అక్కడి రాచమందిరాలు, పెద్ద పెద్ద మిట్టలమీద కట్టారు, వాటికి ఎత్తయిన పైకప్పులు ఉన్నాయి, గోడలన్నీ అలంకార వస్తువులతో నింపి పొదరిల్లులు మరియు చూరులు పర్శియను తరహా రూపకల్పనతో ఎంతో అందముగా తీర్చిదిద్దారు. ఆర్చీల మూలలలో సన్నటి పలకలపై నాజూకు ఆకృతులు మరింత శోభను తెచ్చిపెడుతుంది. రాణీ మహలులో ఉండే ఈ విశేష భోహములను చూసి నాటి మొగలులే అసూయచెందేవారు.
దర్బారు హాలు నుండి కొండపాదమున ఉండే ఒక రాచమందిరమునకు దారి చూపే రహస్య సొరంగ మార్గము ఉండేదని ఒక అభిప్రాయము. ఇస్లాముమత వాస్తుశాస్త్రము ఆధారముగా నిర్మించిన కుతుబ్ షాహీ నవాబుల సమాధులు గోల్కొండకు ఉత్తర దిక్కులో బయట గోడకు 1 కి.మీ. దూరమున నిర్మించారు. ఈ సమాధుల చుట్టూ వనములు, వాటి మధ్య అందమయిన రాతి శిల్పాలు ఉన్నాయి.
కోట బయట రెండు వెర్వేరు మంటపాలను బండరాళ్ళతో నిర్మించారు. వాటిని తారామతి మందిరము మరియు ప్రేమతి మందిరము అని పెలిచేవారు. వీటిలో అక్కాచెళ్ళెలయిన తారామతి మరియు ప్రేమతి నివసించేవారు. వారు రెండంతస్తుల పైన ఒక వృత్తాకారపు వేదికపై తమ ప్రదర్శనలు ఇచ్చేవారు. దానిని కళామందిరమని పిచేవారు. దానిని గోల్కొండ కోట పైన ఉన్న రాజుగారి దర్బారునుండి తిలకించవచ్చు.