కుంతల జలపాతం
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
ఆంధ్ర ప్రదేశ్ లోనే అతి ఎత్తయిన జలపాతం కుంతల జలపాతం. ఇవి ఆదిలాబాదు జిల్లాలోని సహ్యాద్రి పర్వత ఫంక్తుల్లో కడెం నదిపై కుంటాల గ్రామానికి సమీపంలోని అభయారణ్యంలో ఉన్నాయి. 7వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మల్ నుండి ఆదిలాబాదు పోవు మార్గానికి కొద్దిగా కుడివైపునకు ఈ జలపాతం ఉంది. 45 మీటర్ల ఎత్తు నుంచి జలజల పారే నీళ్ళు, ఆ చప్పుడు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. దట్టమైన అడవులలో, సహ్యాద్రి పర్వత శ్రేణిలో గోదావరికి ఉపనది అయిన కడెం నది పై ఈ జలపాతం ఉంది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాదు నుండి ఇది 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.[1] ఈ జలపాతం ఎత్తు 45 మీటర్లు.
జలపాతము యొక్క దిగువభాగము సమతల బండరాయితో కూడుకొని నునుపుదేలి జారుడుగా ఉండును. జలపాతం వద్ద గుండాలు చాలా లోతుగా ఉండి సుళ్ళు తిరుగుతూ ఉండటం వలన ఇక్కడి నీళ్ళలో ఈదటం చాలా ప్రమాదకరం. గతంలో ఈ జలపాతంలో పలువురు పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకొని దుర్మరణం పాలయ్యారు. 2000 సంవత్సరపు వర్షాకాలము నుండి 2006 వర్షాకాలము వరకు 35 మంది కుంటాల జలపాతాల వద్ద ప్రమాదానికి గురై మరణించారు[2]
జలపాతానికి ఈ పేరు దుష్యంతుడి భార్య శకుంతల నుంచి వచ్చిందని స్థానిక ప్రజల విశ్వాసం. ఈ జలపాతం మరియు పరిసరాల దృశ్యం చూసి శకుంతల మైమరిచిపోయి, తరుచుగా ఈ జలపాతంలో స్నానం చేసేదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
ఈ ప్రాంతములో మూడు జలపాతాలు, గుండాలు ఉన్నాయి. ఈ గుండాల్లో ముఖ్యమైన గుండాన్ని స్థానికులు సోమన్న గుండంగా వ్యవహరిస్తారు. జలపాతం వద్ద ప్రకృతిసిద్ధమైన రాతిగుహల్లో శివలింగాలు ప్రతిష్టమై ఉండటంవల్ల ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున భక్తులు ఈ శివలింగాలను దర్శించుకొని పూజలు నిర్వహించడాన్ని సోమన్నజాతరగా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో రెండు రోజులపాటు ఈ జాతర జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం.
జలపాతాలకు చుట్టు ఉన్న అడవి ఉష్ణమండల శుష్క ఆకురాలు వనాల రకానికి చెంది అన్ని జాతుల వృక్షాలు కలిగి అధికముగా టేకు చెట్లతో నిండి ఉన్నది. ఛాంపియన్ / సేథి అటవీ వర్గీకరణ ప్రకారము సమూహము 5నకు చెందినది. ఈ అడవిలో చాలా రకాల అటవీ జంతువులు మరియు పక్షులు ఉన్నాయి.