భట్టిప్రోలు స్తూపం
వికీపీడియా నుండి
తెలుగుదేశ చరిత్రలో ప్రాచీనాంధ్ర నగరమయిన భట్టిప్రోలుది విశిష్టస్థానం[1]. ప్రపంచ బౌద్ధారామాలలో ప్రముఖ చరిత్ర గలిగినదిగా కీర్తించబడిన బృహత్ స్తూపం ఇక్కడ ఉన్నది[2]. క్రీ. పూ. 4-3 శతాబ్దాల నాటి ఈ స్తూపం భవననిర్మాణ రీతులలోని ప్రథమ దశలను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ లభించిన శాసనాలు ప్రజాస్వామిక విలువలకు నెలవైన గణతంత్ర రాజ్యంగా భట్టిప్రోలు ఉనికిని బలపరుస్తున్నాయి[3]. గౌతమ బుద్ధుడు, జైన తీర్థంకరుడైన మహావీరుడు ఈ ప్రాంతాన్ని దర్శించారన్న అభిప్రాయం చరిత్రకారులలో ప్రబలంగా ఉంది[4][5].
సారవంతమైన కృష్ణానదీ మైదానములో సముద్రతీరానికి సమీపములో గల గ్రామం భట్టిప్రోలు. సమీపములో నున్న పోతవరలంక వరకు పెద్ద పడవలు, నౌకలు వచ్చేవనీ, అచటి నుండి వరి ధాన్యము, దినుసులు, వస్త్రాలు ఎగుమతి అవుతుండేవనీ, ప్టొలెమీ (క్రీ. శ. 130) జౌళి పరిశ్రమకు, వాణిజ్యానికి కేంద్రమని వర్ణించిన పిటిండ్ర నగరం భట్టిప్రోలేననీ చరిత్రకారుల అభిప్రాయము[6].
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
ప్రతీపాలపురం, ప్రితుడనగరం, పిటిండ్రలు భట్టిప్రోలుకు నామాంతరాలని చరిత్రకారుల అభిప్రాయం. క్రీ. శ. 8వ శతాబ్దివాడయిన జైనకవి నయసేనాని వ్రాసిన 'ధర్మామృత' కావ్యములో ప్రతీపాలపుర ప్రసక్తి ఉంది. ఇది క్రీ. పూ. 5వ శతాబ్దిలో జరిగిన కథ. ఇక్ష్వాకు రాకుమారుడైన యశోధరుడు దక్షిణదేశానికి వలస వచ్చి ప్రతీపాలపురం రాజధానిగా పాలన చేశాడు. ఈతని వారసుడు ధనదుడు జైన మతము వదిలి బౌద్ధురాలైన కమలశ్రీని పెళ్ళి చేసుకుంటాడు. ఈ కథే బృహత్కథాకోశములో కూడ ఉంది. ధనదుడు తన పేర ధనదపురం నిర్మించాడనీ, అదే నేటి చందోలు అని చరిత్రకారుల అభిప్రాయం. భట్టిప్రోలులో లభించిన శాసనాలలో 'కుబీరక' రాజు ప్రసక్తి ఉంది. కుభీరక, కుబేర ధనదుడి నామాంతరాలు. జైనరాజగు ఖారవేలుడు పితుడ్రనగరం బౌద్ధక్షేత్రాన్ని గాడిదలతో దున్నించి నాశనం చేశాడని ఖారవేలుని శాసనాలలో చెప్పబడినది. ఆ శాసనాలలోని పితుడ్రనగరం భట్టిప్రోలేనని చరిత్రకారులు భావిస్తున్నారు.[7]
[మార్చు] స్తూపం
కాలగర్భంలో కలిసిపోయిన భట్టిప్రోలు బౌద్ధ స్తూప ప్రాశస్త్యం క్రీ. శ. 1870 నుండి వెలుగులోనికి రాసాగింది. బాస్వెల్ (1870), సర్ వాల్టర్ ఎలియట్ (1871), నారిస్ (1872, రాబర్ట్ సెవెల్ (1882), అలెగ్జాండర్ రే (1892), బుహ్లర్ (1894), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (1969) మొదలగువారి కృషివల్ల అమూల్యమైన చారిత్రక నిక్షేపాలు బయల్పడ్డాయి.
లంజ దిబ్బ, విక్రమార్కకోట దిబ్బ అని పిలువబడే మట్టిదిబ్బలు తవ్వగా స్తూపము, కోట గోడలు కనపడ్డాయి. 1700 చదరపు గజాలు స్తూప ఆవరణ, 148 అడుగుల మేధి వ్యాసం, 32 అడుగుల అండం వ్యాసం, 40 అడుగుల ఎత్తు, 8 అడుగుల విశాలమైన ప్రదక్షిణాపథం, 45 X 30 X 8 సె.మీ పరిమాణముగల ఇటుకలతో కట్టబడిన స్తూపం బయల్పడింది.
స్తూపప్రాకారంలో చలువరాతి పలకలు, గోడలో ఇమిడిన నలుచదరపు స్థంభాలు, ఆయక వేదికలు, చక్కగా చెక్కిన బొమ్మలు ఉన్నాయి. ఆయక స్థంభముల ఎత్తు 15 అడుగులు. వానిపై మనుషుల, జంతువుల బొమ్మలు చెక్కి వున్నాయి. ప్రదక్షిణాపథానికి అంచున 4 అడుగుల ఎత్తువరకు పాలరాతి గోడ ఉండేది.
భట్టిప్రోలు స్తూపము ధాతుగర్భము. అనగా బుద్ధుని ధాతువులపై నిర్మించబడినది. శాసనాలలోని 'బుధ శరీరాని నిఖేతుం', 'బుధ శరీరాని మహనీయాని కమ్మనే' అనే వాక్యాలనుబట్టి స్తూపం యదార్ధమయిన బుద్ధ ధాతువుపై నిర్మించబడినట్లు స్పష్టం. స్తూపం మధ్య అమూలాగ్రంగా రంధ్రం ఉన్నది. రంధ్రము చుట్టూ ఇటుకలను పద్మాకారములో అమర్చారు. రంధ్రంలో స్తూపాగ్రాన ఉండే ఛత్రపుకాడను అమర్చారు. రంధ్రముగుండా మూడు బండరాతి పేటికలు (శిలా మంజూషికలు) లభించాయి.
[మార్చు] స్తూప వైశిష్ట్యము
ఆంధ్రులు ఒక విశిష్టమైన స్తూప నిర్మాణశైలిని అభివృద్ధి చేశారు. ఇందు ఆయక స్థంభములు ప్రధానమైన ప్రత్యేకతలు. చక్రాకార స్తూపనిర్మాణము భట్టిప్రోలులో ప్రారంభమై అమరావతి, నాగార్జునకొండ స్తూపములలో పరిణితి చెందింది. చక్రాకార వైశిష్ట్యం ఏమిటంటే, స్తూపానికి పటుత్వం, పవిత్ర ధర్మచక్ర ప్రతిష్ఠ. అనగా నిర్మాణ సౌష్ఠవం మరియు ధర్మభావ వ్యక్తీకరణల మేళవింపు. చక్రాకార స్తూపంలోని ఆకుల సంఖ్య ధర్మభావాలకు ప్రతీకలు.
[మార్చు] శిలా మంజూషికలు
అలెక్జాండర్ రే 1892లో నిర్వహించిన త్రవ్వకాలలో మూడు బండరాతి పేటికలు లభించాయి. మొత్తము మంజూషికలు ఐదు. ఇట్టి శిలా మంజూషికలు మరెక్కడా లభించలేదు. ఈ మంజూషికలలో పవిత్రమయిన బుద్ధధాతువులు నిక్షిప్తమయి ఉన్నాయి. మంజూషికలపైన శాసనాలు చెక్కిఉన్నాయి.
[మార్చు] ఒకటవ శిలా మంజూషిక
1870లో బాస్వెల్ కు ఒక మంజూషిక లభించింది. ఇందులో స్ఫటికపు బరిణె, రాతిపూసలు ఉన్నాయి. బరిణెలో కూన్ని గింజలు, ముత్యాలు ఉన్నాయి.
[మార్చు] రెండవ శిలా మంజూషిక
రాబర్ట్ సెవెల్ ఆరు పలకలుగల రాతిపేటిక కనుగొన్నాడు. ఇందులో ఒక మట్టిపాత్ర, బలపపు రాతిబరిణె, బరిణెలో స్ఫటికపు కరండం దొరికాయి. దీనిలో మరలా ఒక ముత్యము, బంగారు పుష్పాల ముక్కలు, బూడిద ఉన్నాయి. ఈ రాతిపేటిక పగిలిపోయింది. ఇంగ్లాండుకు తరలిస్తుండగా మట్టిపాత్ర, బలపపు బరిణె పగిలిపోయాయి.
[మార్చు] మూడవ శిలా మంజూషిక
అలెగ్జాండర్ రే చేసిన త్రవ్వకాలలో ఉపరితలంనుండి 14 అడుగుల లోతున బండరాతి పేటిక లభించింది. ఇందులో చేయబడిన గుంటలో ధాతుపేటిక ఉంది. పేటికలో రాగి ఉంగరం, రాగి ముక్కలు, పూస, రెండు ముత్యాలు, బంగారు పూసలు, రంధ్రం ఉండి ఆరు పలకలుగా ఉన్న స్పటికపు పూస, బంగారురేకులతో మలచిన త్రిరత్న చిహ్నాలు, 8 రేకులున్న రెండు స్వర్ణ పుష్పాలు, ఏడు బంగారు ముక్కలు, రెండు గట్టి బరిణె మూతలవలె ఉన్న కప్పులు ఉన్నాయి. గుండ్రని రాతి కరండములో స్పటికపు బరిణె ఉంది. అందులో 1/2 అంగుళం వెడల్పు ఉన్న అస్థిక ఉంది. ధాతువును పీతాంబరములో భద్రపరిచిన ఆనవాళ్ళున్నాయి.
[మార్చు] నాలుగవ శిలా మంజూషిక
దీనికి మూతరాయి, క్రిందిరాయి ఉన్నాయి. మూతరాయి అడుగున 19వరుసల శాసనం చెక్కబడిఉంది. పేటికలో స్ఫటికపు బరిణె ఉంది. బరిణెలో 6, 8, 9 రేకులు కలిగిఉన్న 164 స్వర్ణపుష్పాలున్నాయి. గుంటలున్న 6 బంగారు పూసలు, ఒక బంగారు ఉంగరం, రెండు ముత్యాలు, 6 కొరల్ పూసలు, ఒక నీలి స్ఫటికపు పూస, చిన్నగొడుగులు, వెండిరేకు చుట్ట, చుట్ట మడతలో మూడు వరుసలలో అక్షరాలు ఉన్నాయి.
[మార్చు] ఐదవ శిలా మంజూషిక
పేటిక మూతభాగం వంకరగా ఉన్న గుండ్రటి రాయి. దీని లోపల అంచు మెరుగు పెట్టి 9 వరుసలలో శాసనం చెక్కి ఉంది. ఒక స్ఫటికపు కరండం లభించింది. దీనిలో బెరిల్ తో చేసిన బరిణె ఉంది. బరిణె అడుగున మూడు గుంటలున్నాయి. గుంటలలో చిన్న చిన్న అస్థికలున్నాయి. స్ఫటికపు మూతతో బరిణె బిగించి ఉంది. బరిణె క్రింద బంగారు రేకులున్నాయి. రెండు గోమేధిక పూసలు, స్ఫటికపు పోగులు, బంగారు రేకు బొమ్మ, బంగారు చుట్ట, 30 స్వర్ణ పుష్పాలు, 6 ముత్యాలు, తెల్లటి ఖనిజ లవణం, ఇనుప ముక్కలు, రాగి ముక్కలు, ఒక ఎముక పూస మొదలైనవి దొరికాయి.
[మార్చు] శాసనాలు
భట్టిప్రోలు శాసనాలలోని భాష ప్రాకృతము, లిపి బ్రాహ్మీ భేదము. రాతిపేటికలపైన, స్ఫటికపు మంజూషికపైన, వెండిరేకుపైన, స్ఫటికపు పూసపైన 10 లేఖనాలు లభించాయి. ఈ శాసనముల వల్ల స్థానిక సభ దానధర్మములలో భాగస్వామ్యం వహించినట్లు తెలుస్తున్నది. సింహగోష్ఠి అనేది స్థానిక సంస్థ (నాలుగవ పేటిక). గోష్టి సభ్యులందరి పేర్లూ ఉన్నాయి. సింహగోష్ఠి అధ్యక్షుడు కుభీరకుడు (కుబేర, కుభిరక, కుభిర). బుద్ధుని శరీర ధాతువులు నిక్షిప్తం చేయుటకు 'కుర' అనే అతడు పేటిక చేయించాడు (మూడవ పేటిక). ఐదవ పేటిక శాసనములో 'రాజా కుబేరక' అని ఉంది.
[మార్చు] భాష, లిపి
తెలుగు దక్షిణభాషా కుటుంబములోని మూలద్రావిడము నుండి క్రీ. పూ. 5-4 శతాబ్దాలలోనే విడివడి ప్రత్యేక రూపురేఖలను సంతరించుకుందని పండితుల అభిప్రాయము. నేటి తెలుగులిపికి 'మాతృక'గా పరిణామక్రమం లో మొదటిదిగా 'భట్టిప్రోలు లిపి'ని పేర్కొంటారు. శాసనాలలో దక్షిణ మౌర్యలిపికి చెందిన 23 అక్షరాలున్నాయి. గ, శ అనే అక్షరాలు మౌర్యలిపి లాగానే ఉన్నాయి. భ, ద అనే అక్షరాలు నేటి తెలుగు వర్ణాలకు దగ్గరగా ఉన్నాయి. ఘ, జ, మ, ల, ష అనే ఐదు అక్షరాలు చాల వైపరీత్యంతో కన్పిస్తున్నాయి. గ, మ అనే వర్ణములు మౌర్యుల కన్నా ప్రాచీన రూపంగా ఉన్నాయి. అశోకుని శాసనాలలో కన్పించని 'ళ' ఇక్కడ ఉంది. వీటిని బట్టి చూస్తే ఈ శాసనాలు ఆశోకుని శాసనాలకన్నా ప్రాచీనమైనవని భావించవచ్చు.
[మార్చు] రాజ్యము
[మార్చు] ఇవి కూడా చూడండి
- భట్టిప్రోలు
- అమరావతి స్తూపం
- గుంటుపల్లి (కామవరపుకోట)
- శాలిహుండం
- ఘంటసాల (కృష్ణా జిల్లా)
- ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
- బౌద్ధ మతము
[మార్చు] మూలాలు
- ↑ శాతవాహన పూర్వయుగపు స్థావరాలు: చారిత్రక నేపధ్యం, పి. ఆర్. కె. ప్రసాద్, 2004, గుంటూరు జిల్లా సమగ్ర చరిత్ర, గుంటూరు జిల్లా చరిత్ర సంఘం, గుంటూరు
- ↑ The Buddhist Architecture in Andhra, D. J. Das, 1993, Books and Books, New Delhi
- ↑ భట్టిప్రోలు స్తూపము: వాస్తువు, బ్రాహ్మీ శాసనములు, ప్రాక్తెలుగు, కార్తికేయ శర్మ, 1986, భారతి, అక్టోబరు సంచిక
- ↑ Buddha's Preaching of the Kalachakra Tantra at the Stupa of Dhanyakataka, H. Hoffman, in: German Scholars on India, Vol. I, 1973, PP. 136-140, Varanasi
- ↑ Taranatha; http://www.kalacakra.org/history/khistor2.htm
- ↑ బౌద్ధము-ఆంధ్రము, బి. యస్. యల్. హనుమంత రావు, 1995, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు. http://www.archive.org/details/bouddamuandhramu018708mbp
- ↑ సమగ్ర ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి మొదటి భాగం - ముప్పాళ్ళ హనుమంతరావు పేజీ.417 ఏ.బి.ఎస్.పబ్లిషర్స్ రాజమండ్రి
[మార్చు] వనరులు
భట్టిప్రోలు మహాస్తూపము, డా. భ. ఆంజనేయ శర్మ, 2007, భారతీయ పురాతత్వ సర్వేక్షణ, హైదరాబాదు మండలం.