తెలుగు భాషా పత్రిక
వికీపీడియా నుండి
తెలుగు భాషా పత్రిక ఒక అపురూపమైన ప్రయోగశీలతతో, లాభాపేక్ష లేకుండా, కేవలం స్వచ్చందంగా మొదలు పెట్టిన వైజ్ఞానిక పత్రిక. డా. పెమ్మరాజు వేణుగోపాలరావు, డా. గవరసాన సత్యనారాయణ, డా. రావిపూడి సుబ్బారావు, డా. పరిమి కృష్ణయ్య ల సమష్టి ఆధ్వర్యంలో, అమెరికాలోని, జార్జియా రాష్ట్రంలోని, అట్లాంటా నగరం శివార్లలో, 1967-68 ప్రాంతాలలో ఈ పత్రిక స్థాపించేరు. ఏడాదికి నాలుగు సంచికల చొప్పున వెలువరించబడ్డ ఈ పత్రికకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి - పత్రిక వైజ్ఞానిక విషయాలని మాత్రమే ప్రచురించటం. రెండు - జనరంజక శైలిని ప్రోత్సహించటం. మూడు - మొదటి మూడేళ్ళపాటూ ఇది కేవలం రాత పత్రికగా నడవటం. నాలుగు - ఎన్ని అడ్డంకులు వచ్చినా క్రమం తప్పకుండా సర్వాంగ సుందరంగా పత్రిక వేళకి కనబడటం.
ఈ పత్రిక కి ఇండియాలో కూడ ఆదరణ లభిస్తుందనే ఆశతోనైతేనేమి, అచ్చు రూపంలో వెలువరిస్తే ఇంకా అందంగా తీర్చి దిద్దవచ్చనే ఆశతోనేమి, మూడేళ్ళ తరువాత ఈ పత్రికని ఎమెస్కో సంస్థ అధిపతి ఎమ్.ఎమ్.రావు సహాయంతో అచ్చుకొట్టించటం మొదలు పెట్టేరు. అందు వల్లనో, మరెందువల్లనో అచ్చు పత్రిక రావటం మొదలయిన తరువాత క్రమేపీ పత్రికలో ఆకర్షణ, ప్రత్యేకత తగ్గిపోయి పతనమై, మూతపడి పోయింది.
ఈ పత్రిక ప్రతులు ఏ కొద్ది మంది దగ్గరో ఉన్నాయి తప్ప ఈ పత్రిక ఉనికే చాల మందికి తెలియదు. కాని తెలుగులో వైజ్ఞానిక విషయాలు రాయటం అనే మహా ప్రయాణం లో ఈ ప్రయత్నం ఎన్నతగ్గ మైలురాయి. బణువు, వారసవాహికలు, కలనయంత్రం, ద్వియాంశ పద్ధతి, మొదలైన కొత్త మాటలు ఎన్నో ఈ పత్రిక లోనే ప్రయోగాత్మకంగా పుట్టేయి.