పి.ఆదినారాయణరావు
వికీపీడియా నుండి
పి.ఆదినారాయణరావు ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత.
వీరు ఆగష్టు 21 1918 సంవత్సరంలో విజయవాడలో జన్మించారు. చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి వారి 'సావిత్రి' నాటకంలో నారదుని పాత్ర పోషించారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన 'పెదగురువు' అనే పట్రాయని సీతారామశాస్త్రి తండ్రి గారి వద్ద గాత్రం, హార్మోనియం వాయిద్యాలలో శిక్షణ పొందారు. తరువాత కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్ చదివారు. అప్పుడు అమెచ్యూర్ అసోసియేషన్, బర్మాషెల్ అసోసియేషన్ సంస్థలకు రచన, సంగీత బాధ్యతలు వహించేవారు. ఆ తరువాత సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన గొల్లభామ చిత్రానికి గీత రచయితగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. బి.ఎ.సుబ్బారావు నిర్మించిన పల్లెటూరి పిల్ల చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. అర్ధాంగి అంజలీదేవి పేరుతో 1953లో అంజలీ పిక్చర్స్ స్థాపించారు. 1955లో నిర్మించిన అనార్కలి చిత్రం వీరిని ఉత్తమ నిర్మాతల కోవలోకి చేర్చింది. ఇందులోని 'రాజశేఖరా నీపై మోజు తీరలేదురా' అనే మధుర గీతం వీరి సంగీత బాణీకి ఒక మచ్చుతునక. తరువాత 1957లో రూపొందించిన సువర్ణసుందరి తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్వర్ణోత్సవాలు జరుపుకున్న సంగీత రసకలశం. సతీ సక్కుబాయి వీరి కీర్తి కిరీటాన మరో కలికితురాయి.