కొలనుపాక
వికీపీడియా నుండి
కొలనుపాక (Kolanupaka) , నల్గొండ జిల్లా, ఆలేరు మండలానికి చెందిన గ్రామము
కొలనుపాక గ్రామము భువనగిరి డివిజన్ లో మేజరు గ్రామపంచాయితి. వరంగల్ - హైదరాబాదు మార్గంలో హైదరాబాదుకు 80 కి.మీ, ఆలేరు కు సుమారు 6 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామములో సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల మంది జనాభా కలరు. అందులో సుమారుగా ఆరు వేలు ఓటర్లు ఉన్నారు.
విషయ సూచిక |
[మార్చు] గ్రామ చరిత్ర
ఈ గ్రామం పేరు అనేక రూపాంతరాలు చెందింది. మైసూరు వద్ద లభించిన ఒక శాసనంలో దీని పేరు కొల్లిపాకై. అలాగే సోమేశ్వరస్వామి ఆలయం దగ్గర వాగులో ఇసుక మేటలో దొరకిన గంటపై స్వస్తి శ్రీమతు కందప్పనాయకరు, కొల్లిపాకేయ సకలేశ్వర సోమేశ్వర దేవరిగె కొట్టి పూజ అని ఉంది. కాకతీయ రుద్రదేవుని కాలంనాటి శాసనంలో కూడా కొల్లిపాక అని ప్రస్తావించబడింది. విజయనగర రాజుల కాలంనాటికి కొల్పాక్''గా మారింది. ప్రస్తుతం కూల్పాక్ లేదా కొలనుపాక అని పిలువబడుతున్నది.
[మార్చు] గ్రామ చరిత్ర, విశేషాలు
- ఈ గ్రామము చాల చరిత్రాత్మక ప్రదేశము మరియు సుప్రసిద్ద పుణ్యక్షేత్రము, కొటొక్క(కొటి ఓక్కటి )లింగము నూట ఓక్క చెరువు - కుంటలు అదేవిధంగా సొమేశ్వరస్వామి, వీరనారయణస్వామి దేవాలయము, సాయిబాబా దేవాలయము ముఖ్యంగా జైన దేవాలయము (జైన మందిరము), వివిధ రకాల మఠాలు కలవు. అదేవిధంగా సకుటుంబ సమేతంగా సందర్శించదగిన ప్రదేశము. 2వేల సంవత్సరాల పురాతనమైన జైన మందిరములో 1.5 మీ. ఎత్తైన మహావీరుని విగ్రహం ఉంది.
- క్రీ.శ. 11వ శతాబ్దంలో ఇది కళ్యాణి చాళుక్యుల రాజధాని. ఆ కాలంలో ఇది జైన సంప్రదాయానికీ, శైవ సంప్రదాయానికీ కూడా ప్రముఖ కేంద్రము. ప్రసిద్ధ శైవాచార్యుడైన రేణుకాచార్యుడు ఇక్కడే జన్మించాడని సాహిత్యం ఆధారాలు చెబుతున్నాయి. తరువాత ఈ పట్టణం చోళుల అధీనంలోకి, తరువాత కాకతీయుల అధీనంలోకి వెళ్ళింది.
- క్రీ.శ.11వ శతాబ్దం నాటికి ఇది ఎల్లోరా, పటాన్చెరువు, కొబ్బల్ వంటి జైన మహా పుణ్య క్షేత్రాల స్థాయిలో వెలుగొందింది. కొద్దికాలం క్రితమే ఒక జైన శ్వేతాంబరాలయం పునరుద్ధరించబడింది.
- మధ్య యుగం - క్రీ.శ. 1008 - 1015 అయిదవ విక్రమాదిత్యుని కాలం - నాటికి కొలనుపాక ఒక దుర్భేద్యమైన కోటగా విలసిల్లింది. చోళరాజులు (రాజేంద్ర చోళుడు క్రీ.శ. 1013-1014) తాత్కాలికంగా దీనిని జయించినా మళ్ళీ ఇది చాళుక్యుల అధీనంలోకి వచ్చింది. కళ్యాణీ చాళుక్యుల పాలన క్షీణించిన తరువాత ఇది కాకతీయుల పాలనలోకి వచ్చింది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు దీనికి సమీపంలోనే ఉన్నందున ఈ కాలంనుండి కొలనుపాక ప్రాముఖ్యత పలుచబడింది.
[మార్చు] మాణిక్య దేవ ఋషభ దేవ విగ్రహము.
ఈ విగ్రహం మధ్య గర్భగిడిలో మూల నాయక రూపంలో నెలకొని యున్నది. ఇది నలుపు రంగులో శ్రేష్టమైన రత్నంతో నిర్మించబడి యున్నది. 38.5 అంగుళాల వెడల్పు, 34.56 అంగుళాల పొడువు కలిగి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఈ విగ్రహం. విగ్రహం ఆహార్యము బహు గొప్పగా మలచబడినది. అర్ధ పద్మాసన సిద్దాసనంలో ఉండి ముఖ ముద్ర గాంభీర్యంగా ఉన్నది, కాంతి మండలం గుండ్రంగా ఉన్నది, లలాటం మీద చంద్రుడు, చుబుకం మీద సూర్యుడు, నాభి పై ఆకారం, అరచేతి మీద శంఖం మరియు చక్రం ఉన్నాయి. ఇది భరత చక్రవర్తి నెలకొల్పిన అతి ప్రాచీనమైన విగ్రహం.
[మార్చు] భగవాన్ మహావీర్
ఈ విగ్రహం మూల విరాట్టుకు కుడి వైపున గల గర్భ గుడి లో ఉన్నది. ఈ విగ్రహం కుంభకం తో కూడిన సిద్దాసనం మరియు అర్ధ పద్మాసనంలో ప్రశాంతమైన యోగముద్రలో ఉన్నది.వేళ్ళు పొడువుగా ఉన్నాయి. నవ్వు ముఖం, పాల భాగం విశాలంగా ఉండి చుబుకం మనూహరంగా ఉన్నది. వజ్ర విశేషజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఇది ఫిరోజా రాతితో నిర్మించబడింది. ఇలాంటి అత్యధ్బుతమైన ప్రతిమ భారత దేశంలో మరెక్కడా లేదు.
[మార్చు] వనరులు, బయటి లింకులు
- కొలనుపాక పురావస్తు ప్రదర్శన శాల, ఎన్.రమాకాంతం రచన, పురావస్తు పరిశోధనా శాఖ - రాష్ట్ర ప్రభుత్వ ప్రచురణ
- ఇక్కడి గుడుల గురించి
- ఇక్కడి శిల్పాల గురించి
|
|
---|---|
కొలనుపాక · ఆలేరు · రాఘవాపురం (కొలనుపాక) · శ్రీనివాసపురం · పటేల్గూడెం · టంగుటూరు · షారాజీపేట · తూర్పుగూడెం · బహదూర్పేట · మంతపురి · దిలావర్పూర్ · ఇక్కుర్తి · కొల్లూరు · శర్బనాపురం · మాటూరు · అమ్మనబోలు · గోలంకొండ · మందనపల్లి |