ఎన్.జి.రంగా
వికీపీడియా నుండి
ఆచార్య ఎన్.జి.రంగా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు (నవంబర్ 7,1900 - జూన్ 9 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతిచ్చిన ఈయన్ను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.[1]
రంగా, 1900, నవంబర్ 7న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో జన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైనాడు. 1926లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో ఆర్ధిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు.
[మార్చు] స్వాతంత్ర్యసమరంలో
1930లో మహాత్మా గాంధీ పిలుపుకు స్పందించి రంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1933లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించాడు. మూడు సంవత్సరాల తర్వాత కిసాన్ కాంగ్రేస్ పార్టీని స్థాపించాడు. రైతుకూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపాడు. ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై బాపు దీవెనలు అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించాడు.
రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు. 1946లో కోపెన్హేగెన్లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సులో, 1948లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోనూ, 1952లో ఒట్టావాలో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954లో న్యూయార్కులో జరిగిన ఇంటర్నెషనల్ పెజెంట్ యూనియన్లోనూ మరియు 1955లో టోక్యోలో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంటులోను భారతదేశం తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు.
ఈయన కాంగ్రేసు పార్టీ నుండి నిష్క్రమించి భారత కృషీకార్ లోక్ పార్టీ, ఆ తరువాత సహకారరంగ వ్యవసాయానికి బద్ధవ్యతిరేకి అయిన రాజాజీతో కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించాడు. రంగా స్వతంత్ర పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడై ఆ పదవిని ఒక దశాబ్దంపాటు నిర్వహించాడు. 1962 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 25 స్థానాలలో గెలిచి బలమైన ప్రతిపక్షముగా రూపుదిద్దుకొన్నది. 1972లో రంగా తిరిగి కాంగ్రేసు (ఐ)లో చేరాడు.
[మార్చు] రాజకీయ జీవితము
లోక్ సభ | కాలము | నియోజకవర్గం | పార్టీ |
---|---|---|---|
2వ లోక్ సభ | 1957-1962 | తెనాలి | కాంగ్రేసు పార్టీ |
3వ లోక్ సభ | 1962-1967 | చిత్తూరు | స్వతంత్ర పార్టీ |
4వ లోక్ సభ | 1967-1970 | శ్రీకాకుళం | స్వతంత్ర పార్టీ |
7వ లోక్ సభ | 1980-1984 | గుంటూరు | కాంగ్రేస్ (ఐ) |
8వ లోక్ సభ | 1984-1989 | గుంటూరు | కాంగ్రేస్ (ఐ) |
9వ లోక్ సభ | 1989-1991 | గుంటూరు | కాంగ్రేస్ (ఐ) |