అలిపిరి
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
అలిపిరి (English: Alipiri) తిరుపతి నుండి 4-5 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడనుండి తిరుమలకు కాలిబాట మరియు రెండు ఘాట్ రోడ్లు మొదలు అవుతాయి. అలిపిరి సముద్రమట్టానికి 200 మీటర్లు (656 అడుగుల) ఎత్తులో ఉన్నది.[1]
విషయ సూచిక |
[మార్చు] అలిపిరి చరిత్ర
పూర్వం అలిపిరిని అడిపుళీ అని పిలిచేవారు. అడి అంటే పాదం పుళ అంటే చింత చెట్టు. పూర్వం పెద్ద చింత చెట్టు వున్నందున ఇది అలిపిరిగా పిలువబడింది. ఈచెట్టు క్రిందే తిరుమల నంబి రామానుజునికి రామాయణ రహస్యాలను ఉపదేశించాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. మధ్యాహ్నాపు వేళలో రామానుజునికి పాఠం చెప్పడంలో నిమగ్నమై ఉన్నప్పుడు పరమాత్ముని పూజలకు వేళ అయినప్పుడు నంభి తపనని తీర్చే స్వామి పాదాలు ప్రత్యక్ష మయ్యాయట. ఇంకో ఇతిహాసం ప్రకారం కురువతి నంభి వేంకటేశ్వరుని నైవేద్యం కోసం మట్టికుండలు తయారు చేస్తూ ఇక్కడ నివసించాడు. మట్టితో పుష్పాలు చేస్తూ వాటిని భగవత్పాదులకు అర్పణ చేసేవాడు. నంభి కూలాల చక్రం, మట్టి ముద్ద, కూలాల సమ్మెట్టలు శిలాఫలకాలుగా రెండవ గాలి గోపురం మెట్ల ప్రక్కన ఉన్నాయి.
[మార్చు] తిరుమలకు కాలి బాటలు
- ప్రాచీన కాలంలో అలిపిరి నుంచి సామాన్యప్రజలకు కొండ ఎక్కడానికి గుర్తుగా అలిపిరిలో మానవకృత బాట గుర్తులు ఏర్పాటు చేశారు, ఆ గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇక్కడ అలిపిరిలో పాదాల మంటపం కనిపిస్తుంది.
- పూర్వకాలంలో ఇంకో కాలిబాట మార్గం తిరుచానురు నుండి బయలు దేరి కపిలతీర్థం మెకాలి మిట్టకు చేరేవారనిపిస్తుంది.
- మంగళం దగ్గర చలివేంద్రం ఉందని ఇక్కడ నుండి కూడా కొండ ఎక్కడానికి ఒక మార్గం ఉందని చెబుతారు.
- రామాముజుని కాలం నుండి అలిపిరి కాలిబాట ప్రాచుర్యంలోకి వచ్చింది.
తిరుమలకు కాలిమార్గాన చేరటానికి ప్రస్తుతం ఉన్న రెండు సోపాన మార్గాలలో అలిపిరి మార్గము ప్రాచుర్యమైనది. ఇది 11 కిలోమీటర్ల పొడవున బాగా అభివృద్ధి చెందినది. రెండవ మార్గము చంద్రగిరినుండి బయలుదేరుతుంది. ఇది కేవలం 6 కిలోమీటర్ల దూరమే ఉన్నా అలిపిరి మార్గము కంటే కష్టతరమైనది. కాబట్టి దీన్ని కేవలం స్థానికులు మరియు వర్తకులు మాత్రమే ఉపయోగిస్తారు.[2] అలిపిరి నుండి గాలిగోపురం వరకున్న సోపానమార్గాన్ని మట్లి అనంతరాజు నిర్మించాడని భావిస్తారు.[3]
అలిపిరి నుండి తిరుమలకు ఉన్న రెండు తారు పరచిన ఘాట్ రోడ్డులలో పాత దాన్ని 1945లో వేశారు. 19 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గాన్ని ఇప్పుడు కేవలం తిరుమల నుండి వాహనాలు దిగిరావటానికే ఉపయోగిస్తున్నారు. 1974లో కొత్తగా నిర్మించిన రెండవ ఘాట్ రోడ్డును తిరుమల కొండ పైకి వాహనాలు వెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు.
[మార్చు] సోపానమార్గం
మెట్ల దారినే సోపానమార్గం అంటారు.
- పాదాలమండపం
ఇక్కడి నుండి కొండపైకి మెట్లు మొదలవుతాయి. ఇక్కడ వేంకటేశ్వరుని మరియు జయవిజయుల విగ్రహాలు వున్నాయి.
- తలయేరుగుండు
కొండ ఎక్కేవారు దీన్ని తలతో మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులు వుండవని భక్తుల నమ్మకం.
- కురువ మండపం
ఇక్కడ తొండమాను రాజుల కాలంలో కురువనంబి అనే భక్తుడు శ్రీనివాసుని నైవేద్య వంటకు కావలసిన కుండలు చేసేవాడట. అతను అక్కడే ఒక కొయ్యతో స్వామి వారి విగ్రహాన్ని చేసి, దాన్ని మట్టితో చేసిన పూలతో పూజించేవాడట. అక్కడ తిరుమలలో స్వామి వారిని రాజు బంగారుపూలతో పూజించినపుడు ఆపూలు తొలగి ఈమట్టి పుష్పాలు కనిపించేవట. అన్నమయ్య "కొండలలో నెలకొన్న..." లో "కుమ్మరడాసుడైన కురవరుతినంబి" అని రాసింది ఈయన గురించే. స్వామివారు ఈనంబి వద్ద మట్టి కుండలోని సంగటి తినేవారట. నేటికీ తిరుమలకొండపై స్వామి వారికి (బంగారు పాత్రలు ఎన్ని వున్నా) మట్టికుండలోనే నైవేద్యం సమర్పిస్తారు. ఈకురువ మండపంలో కుండలు చేసే దృశ్యాలు చెక్కబడి వున్నాయి.
- శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి
ఇక్కడ 30 అడుగుల శీప్రసన్నాంజనేయస్వామివారి విగ్రహం వుంటుంది. ఈస్వామికి రోజూ అర్చన నివేదనలు జరుగుతాయి. హనుమజ్జయంతి రోజున ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ టిటిడి వారు అభివృద్ది చేసిన ఉద్యానవనాలు వున్నాయి.
[మార్చు] వార్తల్లో అలిపిరి
[మార్చు] మూలాలు
- ↑ Journal of the Indian Roads Congress By Indian Roads Congress పేజీ.761 [1]
- ↑ http://www.tirumala.org/travel_tptm_foot.htm
- ↑ Sri Venkateswara, the Lord of the Seven Hills, Tirupati By Pidatala Sitapati పేజీ.6[2]
[మార్చు] బయటి లింకులు
- వికీమాపియాలో అలిపిరి ఉపగ్రహ చిత్రం.